- ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు వినోద్ జాకర్ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: నీట్ ప్రశ్న పత్రం లీకేజీకి బాధ్యతవహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు వినోద్ జాకర్ డిమాండ్ డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని, మోదీ సర్కార్ హయాంలో ఇప్పటి వరకు 90కి పైగా ప్రశ్న పత్రాల లీకేజీలు జరిగాయని ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో శనివారం ట్యాంక్ బండ్ నుంచి లోక్ భవన్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
నీట్ బాధితులకు న్యాయ చేయాలని, మోదీ డౌన్ డౌన్, విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం రాజ్ భవన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు వినోద్ జాకర్ తోపాటు ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి, ఇతర నేతలు పాల్గొన్నారు. అనంతరం నేతలు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
