
- పాలమూరు కార్పొరేషన్లో 94, దేవరకద్రలో రెండు, మద్దూరులో మూడు అబ్జెక్షన్స్
మహబూబ్నగర్, వెలుగు: గ్రేడ్–-1 మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయిన మహబూబ్నగర్ కార్పొరేషన్లో డివిజన్ల విభజనపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయి. డివిజన్ల విభజనను ఏకపక్షంగా చేశారని ప్రధాన పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. విభజన లోపాలపై 94 అభ్యంతరాలు వచ్చాయి.
షెడ్యూల్ ప్రకారం కార్పొరేషన్ డివిజన్ల ముసాయిదాను ఈ నెల 4న విడుదల చేయాల్సి ఉండగా.. మరుసటి రోజు విడుదల చేశారు. ఈ నెల 6 నుంచి 12 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. దేవరకద్ర, మద్దూరు మున్సిపాలిటీల్లో మాత్రం షెడ్యూల్ ప్రకారమే ముసాయిదా విడుదల, అభ్యంతరాల స్వీకరణ పూర్తి చేశారు.
అభ్యంతరాలు చెబుతున్న పార్టీలు..
డివిజన్ల విభజనపై ప్రధాన పార్టీలు అభ్యంతరం చెబుతున్నాయి. రూల్స్ పాటించకుండా, ఫీల్డ్ ఎంక్వైరీలు చేయకుండానే విభజన చేశారని ఆరోపిస్తున్నారు. ప్రధానంగా పాత వార్డుల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా డివిజన్ల విభజన ఎలా చేశారని ప్రశ్నిస్తున్నారు.
దీనికితోడు ఆ వార్డు మాజీ కౌన్సిలర్లు, ఇతర లీడర్లు, వార్డు పెద్దల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోలేదని చెబుతున్నారు. ఒక వార్డులో ఉన్న ఓటరు మరో వార్డులోకి చేర్చడం పట్ల బీజేపీతో పాటు బీఆర్ఎస్, పలు సంఘాల లీడర్లు ఆఫీసర్లకు వినతిపత్రాలు సమర్పించారు. ముసాయిదాపై 94 అభ్యంతరాలు రాగా.. వీటిపై ఎంక్వైరీ చేసి రిపోర్టును 16న కలెక్టర్కు అందించనున్నారు.
రెండు మున్సిపాల్టీల్లో ఐదు..
దేవరకద్ర మున్సిపాలిటీ వార్డుల విభజనకు సంబంధించి రెండు అభ్యంతరాలు వచ్చినట్లు ఆఫీసర్లు చెప్పారు. దేవరకద్ర మేజర్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు పాత మూడో వార్డు పైన ఫిర్యాదు అందింది. పాత మూడో వార్డును ప్రస్తుతం 12వ వార్డు, రెండో వార్డులో కలిపినందుకు అభ్యంతరం తెలిపినట్లు ఆఫీసర్లు చెప్పారు. మరికొన్ని చిన్న చిన్న సమస్యలను కూడా అధికారులకు ప్రజలు ఫిర్యాదు చేశారు.
తమ ఇండ్లను వేరే వార్డుకు మార్చవద్దని, పాత వార్డులోనే ఉంచాలని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. వచ్చిన అభ్యంతరాల వెరిఫికేషన్ చేస్తున్నట్లు తెలిపారు. మద్దూరు మున్సిపాలిటీ వార్డుల డీలిమిటేషన్కు సంబంధించి మూడు అభ్యంతరాలు రాగా.. వాటిని ఆఫీసర్లు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
కార్పొరేషన్లో డివిజన్లు, ఓటర్లు..
మహబూబ్నగర్ కార్పొరేషన్లో 1.96 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. గ్రేడ్–1 మున్సిపాలిటీలో 49 వార్డులు ఉండగా, కార్పొరేషన్గా అప్గ్రేడ్ కావడంతో 60 డివిజన్లుగా విభజించారు. ప్రతి డివిజన్ పరిధిలో 3,200 మంది నుంచి 3,500 మంది ఓటర్లు ఉండేలా డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టి, ఇటీవల ముసాయిదావిడుదల చేశారు.