ఒడిశాలో పిడుగుల వర్షం కురిసింది. పిడుగుల పాటుకు ఒడిశాలో10మంది మృతి చెందారు. ఆరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడి భారీ వర్షాలు.. పిడుగుపాటుకు 10మంది చనిపోయినట్లు అక్కడి అధికారులు తెలిపారు.
భువనేశ్వర్, కటక్ సహా ఒడిశా తీర ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వాన పడింది. ఖుర్దా జిల్లా, బోలంగీర్, అంగుల్, బౌధ్, జగత్ సింగ్ పూర్, ధెంకనల్ లో పిడుగులు పడ్డాయి.
పిడుగుపాటుకు ఖుర్దా జిల్లాలో నలుగురు చనిపోయారు. బోలంగీర్లో ఇద్దరు, అంగుల్, బౌధ్, జగత్సింగ్పూర్,ధెంకనల్లలో ఒక్కరు చొప్పున మృతి చెందారు. ఖుర్దాలో పిడుగుపాటుకు ముగ్గురు గాయపడ్డారు.
మరోవైపు మరో నాలుగు రోజుల పాటు ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈశాన్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. సెప్టెంబర్ 3 నాటికి ఉత్తర బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.
ఒడిశాలో తుపాన్ ప్రభావం వల్ల భారీవర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. భువనేశ్వర్, కటక్ నగరాల్లో కేవలం 90 నిమిషాల్లోనే 126 మిల్లీమీటర్ల వర్షం పడిందని తెలిపింది. మరో నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో భారీవర్షం కురిసే అవకాశం ఉందని.. పిడుగులు పడే అవకాశం కూడా ఉందని ప్రకటించింది. వర్షాల సమయంలో ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని సూచించింది.