మొత్తం 13 లక్షల ఎకరాలు
మ్యుటేషన్ కావాల్సింది ఇంకో 80 వేల ఎకరాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రాజెక్టులు, కాల్వలు, ఇతర అవసరాలకు సేకరించిన భూమి 13 లక్షల ఎకరాలుగా లెక్క తేల్చారు. ఇంకో 80 వేల ఎకరాలు మ్యుటేషన్ కావాల్సి ఉన్నట్టు నిర్ధారించారు. ఈ మేరకు ఇరిగేషన్ ఇన్వెంటరీ రిపోర్టు సిద్ధమైంది. 2, 3 రోజుల్లో దీన్ని సీఎంకు సమర్పించే అవకాశముంది. కోటీ 25 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టగా.. ఇప్పటికే 71 లక్షల ఎకరాలకు నీరు అందించే వ్యవస్థ సిద్ధమైనట్టు ఆఫీసర్లు తేల్చారు. ఇంకో 54 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే వ్యవస్థను రెడీ చేయాల్సి ఉందన్నారు.
39 వేల కిలోమీటర్ల కాల్వలు
రాష్ట్రంలోని అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నుంచి నీటిని ఎత్తిపోయడానికి 80 పంపుహౌస్లు ఉండగా.. వాటిలో 340 మోటార్లు, పంపులు బిగించినట్టు రిపోర్టులో పేర్కొన్నారు. 112 కిలోమీటర్ల అండర్ టన్నెళ్లు, 750 కిలోమీటర్ల పైపులైన్లు, 39 వేల కిలోమీటర్ల పొడవైన కాల్వలు ఉన్నట్టు తెలిపారు.