- అంతర్జాతీయ బెంచ్ మార్క్ 29 శాతానికి జంప్
- చరిత్రలోనే ఇది ఒకరోజులో అతిపెద్ద పెరుగుదల
- 2022లో రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తర్వాత
- 100 డాలర్ల మార్క్ను దాటడం ఇదే మొదటిసారి
- యుద్ధ సంక్షోభంతో భగ్గుమన్న చమురు ధరలు
- హార్ముజ్ జలసంధి మూసివేతతో సరఫరాకు విఘాతం
- ఆందోళనలో ప్రపంచ మార్కెట్లు
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఇంధన మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఇరాన్–-ఇజ్రాయెల్,- అమెరికా మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరడంతో క్రూడ్ ఆయిల్ ధరలు సోమవారం ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. అంతర్జాతీయ బెంచ్మార్క్ ‘బ్రెంట్ క్రూడ్’ ధర ఏకంగా 29 శాతం ఎగబాకి రికార్డు స్థాయిలో 119.46 డాలర్లకు చేరింది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి కంటే ఇది 65 శాతం అధికం. చమురు ధరల చరిత్రలోనే ఇది ఒకరోజులో అతిపెద్ద పెరుగుదలగా నమోదైంది. మరోవైపు అమెరికా చమురు ధరలకు బెంచ్మార్క్గా ఉన్న వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) ధర 31 శాతం పెరిగి 119.43 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 2022లో రష్యా-–ఉక్రెయిన్ యుద్ధం తర్వాత, క్రూడ్ ఆయిల్ ధరలు తిరిగి 100 డాలర్ల మార్కును దాటడం ఇదే మొదటిసారి.
స్తంభించిన హార్ముజ్ జలసంధి
ప్రపంచ చమురు రవాణాలోనే అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు నిలిచిపోవడమే ఈ భారీ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. గత నెల 28న ఇజ్రాయెల్,-అమెరికా–ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం తీవ్రతరమైంది. దీంతో పశ్చిమాసియాలో చమురు ఉత్పత్తి, షిప్పింగ్కు అంతరాయం కలుగుతున్నది. మరోవైపు హర్ముజ్ జలసంధిని మూసివేశామని, చమురు నౌకలు దానిని దాటడానికి ప్రయత్నిస్తే నిప్పు పెడతామని ఇరాన్ హెచ్చరికలు జారీచేసింది. ఇరాన్ తీరానికి సమీపంలో పలు చమురు ట్యాంకర్లపై బాంబు దాడులు జరగడంతో ఈ మార్గం మూతపడింది. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం వాటా ఈ జలసంధి గుండానే జరుగుతుంది. ‘ఈ మార్గం తెరిచే ఉంది’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ‘ భరోసా ఇస్తున్నప్పటికీ, ఇరాన్ దాడుల భయంతో నౌకాయాన సంస్థలు ముందుకు రావడం లేదు. ఫలితంగా అంతర్జాతీయ చమురు మార్కెట్అతలాకుతలం అవుతున్నదని నిపుణులు పేర్కొంటున్నారు.
1973 నాటి పరిస్థితులు ఎదురవుతాయా?
1973ను ప్రపంచ చమురు వాణిజ్యంలో అతిపెద్ద సంక్షోభంగా పేర్కొంటారు. అరబ్ దేశాలు,- ఇజ్రాయెల్ యుద్ధం సమయంలో ఈ పరిస్థితి నెలకొన్నది. ఈ మొదటి ‘చమురు సంక్షోభం’ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గమనాన్నే మార్చేసింది. 1973 అక్టోబర్లో ఇజ్రాయెల్కు, అరబ్ దేశాల కూటమికి (ఈజిప్ట్, సిరియా నేతృత్వంలో) మధ్య ‘యోమ్ కిప్పూర్’ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్కు అమెరికా, ఇతర వెస్ట్రన్ కంట్రీస్ మద్దతు పలికాయి. దీనికి నిరసనగా ‘ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్’ (ఒపెక్ దేశాలు) సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఇజ్రాయెల్కు మద్దతు ఇచ్చే దేశాలకు చమురు సరఫరాను నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. దీంతో కేవలం కొన్ని నెలల్లోనే ముడి చమురు ధర బ్యారెల్కు 3 డాలర్ల నుంచి నుంచి 12 డాలర్లకు చేరుకున్నది. అంటే దాదాపు 400 శాతం పెరిగింది. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు కట్టాయి. అమెరికా, యూరప్ దేశాల్లో ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటింది. ప్రపంచం తీవ్రమైన ఆర్థిక మాంద్యంలోకి జారుకున్నది. ఈ దెబ్బతోనే ప్రపంచ దేశాలు స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించాయి. కాగా, 1973 లాగే ఇప్పుడు కూడా పశ్చిమాసియా యుద్ధ భూమిగా మారింది. ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ ఆధిపత్య పోరు చమురు క్షేత్రాల వైపు మళ్లుతున్నది. అప్పట్లో సరఫరా నిలిపివేత ఆయుధమైతే.. ఇప్పుడు హార్ముజ్ జలసంధి మూసివేత అతిపెద్ద ప్రమాదంగా మారింది. ప్రపంచ చమురులో 20 శాతం ఇక్కడి నుంచే వస్తుంది కాబట్టి, ఇది మూతపడితే 1973 నాటి ధరల పెరుగుదల మళ్లీ చూడొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
భారత్పై ఎఫెక్ట్ ఎంత?
ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు. క్రూడాయిల్ బ్యారెల్ ధర ప్రతి 10 డాలర్ల పెంపుతో దేశ కరెంట్ అకౌంట్ లోటు జీడీపీలో 0.35–-0.5 శాతానికి పెరుగుతుంది. చమురు ధరలు 10 శాతం పెరిగితే.. ద్రవ్యోల్బణం 20 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉంది. డాలర్ల అవసరం పెరగడం వల్ల రూపాయి విలువ మరింత పడిపోయే ప్రమాదం ఉంది. అయితే, రష్యా నుంచి చమురు కొనేందుకు భారత్కు అమెరికా 30 రోజుల మినహాయింపు ఇచ్చింది. రాయితీపై లభించే రష్యన్ చమురు మన ఆర్థిక వ్యవస్థను కొంతవరకు ఆదుకోవచ్చని జేఎం ఫైనాన్షియల్ లాంటి సంస్థలు చెబుతున్నాయి.
