- ఇద్దరు ఔట్సోర్సింగ్ సిబ్బంది తొలగింపు
హైదరాబాద్, వెలుగు: సమయపాలన పాటించని ఉద్యోగులపై ఆయిల్ఫెడ్ యాజమాన్యం కఠిన చర్యలు చేపట్టింది. బషీర్బాగ్లోని ఆయిల్ఫెడ్ సెంట్రల్ ఆఫీసును వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేయగా ఉదయం 10.30 గంటలైనా చాలామంది విధులకు రాకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలస్యంగా వచ్చేవారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
దీంతో అప్రమత్తమైన ఆయిల్ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ యాస్మిన్ బాషా శనివారం కార్యాలయానికి ఆలస్యంగా వచ్చిన ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఆలస్యంగా హాజరైన ఆరుగురు రెగ్యులర్ ఉద్యోగులకు మెమోలు జారీ చేశారు. ఔట్సోర్సింగ్ సిబ్బందిలో ఇద్దరిని తొలగించగా, మరో ఇద్దరిని బదిలీ చేశారు. ముగ్గురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మెమోలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఎండీ స్పష్టం చేశారు.
