
- 20 లక్షల సొత్తు సీజ్
ఎల్బీనగర్, వెలుగు: వరుస చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని పహాడి షరీఫ్ పోలీస్ అరెస్టు చేశారు. అతని నుంచి రూ.20 లక్షల విలువైన బంగారం, వెండి ఆభణాలు, నగదు, రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నాడు. మహబూబ్ నగర్ జిల్లాలోని గజలపేటకు చెందిన అల్లం శివ జీవనోపాధి కోసం నగరానికి వచ్చి పెద్ద అంబర్ పేటలో నివాసం ఉంటున్నాడు. రోజువారీ ఫైనాన్స్ చేస్తున్నప్పటికీ చెడు వ్యసనాలకు డబ్బులు సరిపోక దొంగతనాలు చేస్తున్నాడు. ఇనుప రాడ్డుతో ఇండ్ల తాలాలు పగల కొట్టి చోరీలకు పాల్పడుతున్నాడు. పహాడి షరీఫ్, హయత్ నగర్, ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 7 చోట్ల చోరీలకు పాల్పడ్డాడు.
బుధవారం ఉదయం షాలిబండలో దొంగిలించిన వస్తువులను విక్రయించడానికి ప్రయత్నిస్తుండగా, పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో 7 చోట్ల చోరీలు చేసినట్లు అంగీకరించాడు. అతని వద్ద 17 తులాల బంగారం, 41 తులాల వెండి ఆభరణాలు, రూ. 50 వేల నగదు, రెండు బైక్లు స్వాధీనం చేసుకుని, రిమాండ్కు తరలించారు. గతంలో వెల్దండ, ఊర్కొండ, మిడ్జిల్, మంచాల్, కల్వకుర్తి పోలీస్ స్టేషన్లలో నమోదైన చోరీ కేసుల్లో శివ జైలుకు వెళ్లొచ్చినట్లు పోలీసులు తెలిపారు.