కోల్కతా: బెంగాల్అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం కోల్కతాలో మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఆయన ‘చార్జ్ షీట్’ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు కేవలం బెంగాల్ భవిష్యత్తు కోసమే కాదని, దేశ భద్రతకు సంబంధించినవని పేర్కొన్నారు.
గత 15 ఏండ్ల టీఎంసీ పాలనలో చొరబాటుదారులకు బెంగాల్ ప్రధాన కారిడార్గా మారిందని అమిత్ షా ఆరోపించారు. బంగ్లాదేశ్ సరిహద్దులో ఫెన్సింగ్ వేయడానికి అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వడం లేదని, చొరబాటుదారులను తమ ఓటు బ్యాంకుగా మార్చుకోవడమే దీని వెనుక ఉన్న ఉద్దేశమని ఆయన మండిపడ్డారు.
ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) కార్యక్రమాన్ని మమతా బెనర్జీ వ్యతిరేకించడాన్ని షా తప్పుపట్టారు. మైనారిటీ ఓటు బ్యాంకు కోసమే ఆమె రాజ్యాంగ సంస్థలను దూషిస్తున్నారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఓటర్ల జాబితా నుంచి చొరబాటుదారుల పేర్లను తొలగించి, దేశం నుంచి పంపుతామన్నారు.
