
దిల్ సుఖ్ నగర్, వెలుగు: ఓ వైపు తండ్రి మరణం.. మరోవైపు పరీక్ష తప్పడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బడంగ్ పేట అల్మాస్గూడ విశాఖ నగర్ కు చెందిన జేరిపేట హర్షిత్ (18) తండ్రి ఇటీవల మృతి చెందాడు. ఆ బాధతో జేఈఈ మెయిన్స్ క్వాలిఫై కాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. మాదాపూర్ లోని ఓ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటున్న హర్షిత్ శుక్రవారం సాయంత్రం తల్లి ప్రభావతికి ఫోన్ చేసి డిప్రెషన్ తట్టుకోలేకపోతున్నానని చెప్పి కాల్ కట్ చేశాడు. ఆ తరువాత వీఎం హోమ్ మెట్రో స్టేషన్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.