కరోనా వైరస్ ( కోవిడ్ -19 ) తో దేశం పోరాడుతున్న సమయాన కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్. అయితే గురువారం పొద్దున సోనియా గాంధీ మాట్లాడుతూ.. బీజేపీ మత విద్వేష వైరస్ను వ్యాప్తి చేస్తుందని అన్నారు. ఈ కామెంట్స్పై సోనియా గాంధీకి జవదేకర్ బదులిచ్చారు. తామంతా కలిసి కరోనాపై పోరాడుతుంటే సోనియా గాంధీ బాధ్యతలేకుండా మాట్లాడుతున్నారని… బీజేపీకి మత విద్వేషాలు సృష్టించాల్సిన అవసరం లేదని అన్నారు. విపత్తు సమయాన సోనియా గాంధీ రాజకీయ ప్రయోజనాలను చూసుకోరాదని తెలిపారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటి సమావేశంలో సోనియాగాంధీ మాట్లాడుతూ బీజేపీ సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తుందని అన్నారు. తామంతా ప్రజలతో కలిసి కరోనాను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తుంటే బీజేపీ మత వైరస్ను వ్యాప్తిచేస్తుందని చెప్పారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు ఈవీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
