‘మా’లో మళ్లీ లొల్లి

‘మా’లో మళ్లీ లొల్లి

హైదరాబాద్, వెలుగు: మూవీ ఆర్టిస్ట్స్‌‌ అసోసియేషన్(మా)లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మా అధ్యక్షుడు నరేశ్ వైఖరి, ప్రవర్తన, ఏకపక్ష నిర్ణయ ధోరణిని తప్పుపడుతూ అసోసియేషన్‌‌లోని 15 మంది ఎగ్జిక్యూటివ్‌‌ మెంబర్లు డిసిప్లినరీ కమిటీకి లేఖ రాశారు. నరేశ్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ఆయన చేసే పనుల వల్ల కార్యవర్గ సభ్యులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆరోపించారు. జీవిత, హేమ, బెనర్జీ, సురేశ్ కొండేటి, రాజా రవీంద్ర, ఉత్తేజ్, ఏడిద శ్రీరామ్, జయలక్ష్మి, తనీశ్ తదితరులు ఆ లెటర్​లో సంతకాలు చేశారు.  ‘మా’ నిధులు నరేశ్ దుర్వినియోగం చేస్తున్నారని, అభివృద్ధికి అడ్డుపడుతున్నారని అందులో ఆరోపించారు. ‘మా’ సొమ్మును తన సన్నిహితులకు ధారాదత్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మధ్య జరిగిన ‘మా’ 2020 డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో గొడవ జరగడం, వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజశేఖర్ రాజీనామా చేయడం తెలిసిందే. తర్వాత క్రమశిక్షణ చర్యల కోసం కృష్ణంరాజు, చిరంజీవి, మురళీమోహన్, మోహన్ బాబు, జయసుధలతో ఉన్నతస్థాయి కమిటీని ‘మా’ నియమించింది. ఈ నేపథ్యంలో తాము చేసిన ఆరోపణలపై చర్యలు తీసుకోకపోవడంతో క్రమశిక్షణ కమిటీకి 15 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మంగళవారం లేఖ రాశారు. దీంతో ‘మా’ వివాదం మరింత ముదిరింది.