ఆరు గ్యారంటీలకు ఒక్కటే అప్లికేషన్

ఆరు గ్యారంటీలకు ఒక్కటే అప్లికేషన్

తెలంగాణలో డిసెంబర్ 28 నుంచి ప్రజాపాలన ప్రారంభమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అర్హుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆరు గ్యారంటీల దరఖాస్తు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వస్తుందని, ప్రతి కుటుంబం నుంచి అప్లికేషన్లు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్‌లోని 21 లక్షల మంది ఇండ్లకు అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందకుండా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కౌంటర్ల వద్ద ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందుతాయన్నారు. ప్రజాపాలన దరఖాస్తు ఫారమ్‌ను నేడు సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్థం చేసిందని మండిపడ్డారు.

అన్నింటికీ ఒక్కటే అప్లికేషన్

  • ప్రజా పాలనలో భాగంగా అర్హుల నుంచి తీసుకునే దరఖాస్తులో మొదటి పేజీలో కుటుంబ వివరాలతో పాటు ఇంటి యజమాని పేరు, క్యాస్ట్, పుట్టిన తేదీ, ఆధార్, రేషన్ కార్డు, వృత్తి వివరాలను తీసుకుంటారు.
  • మహాలక్ష్మి పథకం కింద ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500కు గ్యాస్ సిలిండర్​కు గ్యాస్ కనెక్షన్ నంబర్, సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య వివరాలు తీసుకోనున్నారు.
  • రైతు భరోసా పథకం కింద ఏటా రైతులకు రూ.15 వేలు ఇచ్చేందుకు రైతు, కౌలు రైతు కేటగిరీల వారీగా వివరాలు తీసుకోనున్నారు. పట్టాదారు పాసు పుస్తకం నంబర్లు, సాగు చేస్తున్న భూమి సర్వే నంబర్లు, విస్తీర్ణం అడిగారు.
  • వ్యవసాయ కూలీలకు ఏటా12 వేలు  ఇచ్చేందుకు ఉపాధి హామీ కార్డు నంబర్ ఇవ్వాలి.
  • ఇందిరమ్మ ఇండ్ల పథకంలో రెండు కేటగిరీలు ఉన్నాయి. ఇండ్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించేది ఒకటి. మరో కేటగిరీలో అమరవీరులు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇచ్చేందుకు.. నమోదైన కేసు, ఎఫ్ఐఆర్​ వివరాలు, ఎంతకాలం ఏ జైలులో ఉన్నారు? ఒకవేళ అమరులైతే చనిపోయిన సంవత్సరం, డెత్ సర్టిఫికెట్ వంటివి నింపాల్సి ఉంటుంది.
  • గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం మీటర్ నంబర్, ప్రతినెల గృహ విద్యుత్ వినియోగం వివరాలు ఇవ్వాలి.
  • చేయూత పథకం కింద రూ.4 వేల కోసం వృద్ధాప్య, గీత కార్మికులు, డయాలిసిస్ బాధితులు, బీడీ కార్మికుల జీవన భృతి, ఒంటరి మహిళల జీవన భృతి, వితంతు, చేనేత కార్మికులు, ఎయిడ్స్​ వ్యాధిగ్రస్తులు, పైలేరియా బాధితులు, బీడీ టేకేదారు జీవన భృతి సర్టిఫికెట్లు, దివ్యాంగుల పెన్షన్ రూ.6 వేలు పొందేందుకు సదరం సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి అప్లికేషన్‌కు ఒక రసీదు ఇస్తారు. అందులో ఏ అధికారి అప్లికేషన్ తీసుకున్నారో ఆయన పేరు తీసుకోనున్నారు. ప్రతి అప్లికేషన్​కు ఆధార్ కార్డు, వైట్ రేషన్ కార్డు కాపీలను జత చేయాల్సి ఉంటుంది.