
- ఈజీమనీకి అలవాటు పడి సర్వం పొగొట్టుకుంటున్న యువత
- నష్టపోయిన డబ్బులను తిరిగి రాబట్టుకునేందుకు అప్పులు
- చేసి మరీ బెట్టింగ్..చివరకు ఆస్తులు పోయి..
- అప్పుల పాలై నేరాల బాట
మంచిర్యాల, వెలుగు : ఎక్కువగా కష్టపడకుండా డబ్బు సంపాదించాలని కొందరు.. తక్కువ సమయంలోనే లక్షలు వస్తాయన్న ఆశతో మరికొందరు ఆన్లైన్ బెట్టింగ్కు బానిసలుగా మారుతున్నారు. ఇలాంటి వారి ఆశను అనుకూలంగా మలుచుకుంటున్న బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు మొదట్లో లక్షల్లో లాభం వచ్చినట్లు చూపిస్తున్నారు.
ఇదంతా నిజమేనని నమ్మిన వ్యక్తులు సదరు యాప్స్ ద్వారా మరిన్ని డబ్బులు పెట్టుబడిగా పెడుతున్నారు. ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు అసలు కథ నడిపిస్తూ నష్టాలు వచ్చినట్లు చూపి లక్షలు దండుకుంటున్నారు.
బెట్టింగ్లో పోయిన డబ్బులను తిరిగి అక్కడే సంపాదించుకోవాలన్న ఆరాటంతో బాధితులు మరింత ఊబిలోకి కూరుకుపోతున్నారు. చివరకు లక్షల్లో నష్టపోయి, అప్పులపాలై నేరాలకు పాల్పడడం గానీ, తమ ప్రాణాలు తీసుకోవడం గానీ చేస్తున్నారు.
వందల్లో ఆన్లైన్ గేమ్స్
ప్రతి ఒక్కరి చేతిలోకి స్మార్ట్ ఫోన్ చేరడం, విస్తృతమైన ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు ఈజీ మనీకి ఆశపడుతున్న చాలా మంది బెట్టింగ్స్ యాప్స్ వలలో చిక్కుకుంటున్నారు. కొందరు యాక్టర్లు, సోషల్ మీడియా ఇన్స్ఫ్లుయన్సర్లు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తుండడంతో విద్యార్థులు, యువత, మహిళలు, రైతులు, వ్యాపారులు, ఉద్యోగులు.. ఇలా అన్ని రంగాల వారు బెట్టింగ్ యాప్స్ వైపు ఆకర్షితులు అవుతున్నారు.
ఇంటర్నెట్లో, ప్లే స్టోర్స్లో వందల సంఖ్యలో ఆన్లైన్ గేమ్స్, స్పోర్ట్స్ బెట్టింగ్ యాప్స్ అందుబాటులో ఉంటున్నాయి. దీంతో ఎవరికి నచ్చిన యాప్ను వారు డౌన్లోడ్ చేసుకుంటూ బెట్టింగ్ పెడుతున్నారు. మొదట్లో సరదాగా ఆడుతున్న యువత తర్వాత బానిసలుగా మారి సర్వం పోగొట్టుకుంటున్నారు.
బ్యాన్ చేసినా ఆగని దోపిడి
బెట్టింగ్ యాప్స్కు బానిసలై ఎంతో మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని గుర్తించిన కేంద్రం ఇలాంటి యాప్స్ను బ్యాన్ చేస్తూ పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చింది. బెట్టింగ్ యాప్లను
ప్రమోట్ చేసినా, వాటిని వినియోగించినా చట్ట ప్రకారం జరిమానా, జైలుశిక్ష పడేలా చట్టాన్ని రూపొందించింది. అయినప్పటికీ బెట్టింగ్ యాప్ల దోపిడీ మాత్రం ఆగడం లేదు. వాటి మాయలో పడుతున్న యువత ఇప్పటికీ మోసపోతూనే ఉంది.
బెట్టింగ్ యాప్లను రద్దు చేయడమే కాకుండా ప్రమోట్ చేసిన వారిపైనా చర్యలు తీసుకోవాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో పోలీస్ శాఖ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆన్లైన్లో బెట్టింగ్ ఆడేవారిపై నిఘా పెట్టిన పోలీసులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
మంచిర్యాల జిల్లా శెట్పల్లికి చెందిన నరిగె రవీందర్ చెన్నూర్ ఎస్బీఐ2లో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. చిన్న వయసులోనే సుమారు రూ. లక్ష జీతంతో జాబ్ వచ్చినా సంతృప్తి చెందలేదు. ఈజీ మనీపై ఆశతో ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటుపడి రూ.40 లక్షలు నష్టపోయాడు. ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు మళ్లీ బెట్టింగ్లనే నమ్ముకున్నాడు. ఇందుకు డబ్బు కావాల్సి రావడంతో తాను పనిచేస్తున్న బ్యాంకుకే కన్నం వేశాడు.
ప్రజలు తాకట్టు పెట్టిన 20.50 కిలోల బంగారం దొంగిలించి వాటిని ప్రైవేట్ సంస్థల్లో తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులను కూడా బెట్టింగ్లోనే పెట్టాడు. ఇలా మొత్తం రూ.10 కోట్లకు పైగా నష్టపోయినట్లు తేలింది. ఇప్పుడు రవీందర్తో పాటు అతడికి సహకరించిన 46 మంది జైలుపాలయ్యారు.
బెట్టింగ్ ఆడడం, నిర్వహణ రెండూ నేరమే
ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్ మాయలో పడి చాలా మంది నష్టపోతున్నారు. బెట్టింగ్ యాప్లలో మొదట కొంత మొత్తం గెలుచుకున్నట్లు చూపించి ఆ తర్వాత మోసం చేస్తారు. జరిగిన నష్టాన్ని మళ్లీ పూడ్చుకోవాలన్న ఆశతో చాలా బెట్టింగ్ యాప్స్కు బానిసలుగా మారుతున్నారు.
ఆస్తులు పోయి, అప్పుల పాలై నేరాలకు పాల్పడుతున్నారు. బెట్టింగ్ ఆడడం, నిర్వహించడమూ నేరమే. పిల్లలు దారితప్పకుండా తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలి. అవసరమైతే వారికి కౌన్సెలింగ్ ఇప్పించాలి.
- ఎ.భాస్కర్, డీసీపీ, మంచిర్యాల–