- బీజాపూర్ జిల్లాలో 25 మంది, దంతెవాడలో ఐదుగురు,
- కాంకేర్, సుక్మా జిల్లాల్లో ఇద్దరు చొప్పున...
- 118 ఆయుధాలు అప్పగింత
- రూ. 14 కోట్లకు పైగా విలువైన డంప్ స్వాధీనం
భద్రాచలం, వెలుగు : ఆపరేషన్ కగార్ చివరి రోజైన మంగళవారం ఛత్తీస్గఢ్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. బస్తర్ ఐజీ సుందర్రాజ్, బీజాపూర్ ఎస్పీ జితేంద్రయాదవ్ సమక్షంలో 25 మంది సరెండర్ అయ్యారు. వీరందరిపై రూ.1.47 కోట్ల రివార్డు ఉంది. వీరు వివిధ రకాల 93 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు.
లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారంతో భద్రతాబలగాలు తనిఖీలు చేసి రూ.2.90 కోట్లతో పాటు రూ.11.16 కోట్ల విలువైన 7.20 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన వారిలో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీలో కీలక నేతలైన మంగళ్ కోర్సా, ఆకాశ్ అలియాస్ ఫాగూ, డీవీసీఎం శంకర్ ముచాకీతో పాటు ఏసీఎంలు రాజు, పాలె కుర్సం ఉన్నారు.
లొంగిపోయిన 25 మందిలో 12 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా నాలుగు ఏకే 47లు, 9 ఎస్ఎల్ఆర్లు, ఒక ఇన్సాస్ ఎల్ఎంజీ, ఏడు ఇన్సాస్ రైఫిల్స్, ఒక కార్బైన్, పన్నెండు 303 రైఫిల్స్, ఒక 8ఎంఎం పిస్టల్, ఏడు సింగిల్ షాట్ గన్స్, 23 బీజీఎల్ లాంఛర్లు, మూడు 315 బోర్ తుపాకులు, మరో పద్నాలుగు 12 బోర్ తుపాకులతో పాటు పలు పేలుడు పదార్థాలను పోలీసులకు అప్పగించారు.
అలాగే దంతెవాడ ఎస్పీ గౌరవ్రాయ్ ఎదుట బైరంగఢ్ ఏరియా కమిటీకి చెందిన ఏసీఎం సోమే కడతి, సభ్యులు లక్మా ఓయం, సరితా పొడియం, జోగి కల్మూ, మోతీ ఓయం సరెండర్ అయ్యారు. వీరిచ్చిన సమాచారంతో ఎనిమిది ఎస్ఎల్ఆర్లు, రెండు ఇన్సాస్లు, ఒక కార్బైన్, ఒక 303 రైఫిల్, ఐదు బీజీఎల్ లాంఛర్లను స్వాధీనం చేసుకున్నారు.
లొంగిపోయిన వారిలో సోమె కడతిపై రూ. ఐదు లక్షలు, మిగిలిన నలుగురిపై రూ.లక్ష చొప్పున రివార్డు ఉంది. అలాగే కాంకేర్ జిల్లా పోలీసుల ఎదుట కమాండర్ శంకర్, సభ్యుడు డోడీ హిడ్మాలు ఏకె-47, వాకీటాకీతో లొంగిపోయారు. సుక్మా ఎస్పీ కిరణ్ చౌహాన్ ఎదుట జనీలా, మడకం హిడ్మేలు లొంగిపోయారు. వీరిపై రూ.8 లక్షల చొప్పున రివార్డు ఉంది. కాగా వీరిచ్చిన సమాచారంతో రూ. పది లక్షలు, మూడు 303 రైఫిల్స్, రెండు ఏకే-47లు, ఒక ఇన్సాస్ ఎల్ఎంజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
