హైదరాబాద్, వెలుగు: చిన్నారులను బాల కార్మిక వ్యవస్థ నుంచి కాపాడేందుకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్ విజయవంతంగా కొనసాగుతున్నది. ‘ఆపరేషన్ స్మైల్- 17లో భాగంగా కేంద్ర హోం శాఖ మార్గదర్శకత్వంలో నెల రోజులు కొనసాగిన ఈ ప్రత్యేక డ్రైవ్లో 5,582 మంది చిన్నారులను రాష్ట్ర పోలీసులు రెస్క్యూ చేశారు. ఈ మేరకు విమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీ చారుసిన్హా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర హోం శాఖ మార్గదర్శకత్వంలో జనవరి 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు ఆపరేషన్ స్మైల్ నిర్వహించామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 121 సబ్ డివిజనల్ పోలీసు బృందాలు ఇందులో పాల్గొన్నాయని, మొత్తం 605 మంది పోలీసు సిబ్బంది పనిచేశారని వివరించారు. రెస్క్యూ చేసిన 5,582 మంది చిన్నారుల్లో 5,108 మంది బాలురు, 474 మంది బాలికలు ఉన్నట్లు అడిషనల్ డీజీ చారుసిన్హా తెలిపారు. వీరిలో 2,292 మంది బిహార్, ఉత్తర్ప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సహా సుమారు 15 రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని వెల్లడించారు. నేపాల్కు చెందిన 43 మంది చిన్నారులను సైతం రక్షించినట్లు తెలిపారు.
