
సీఎం పద్మ పురస్కారాల్లో తెలంగాణకు అవమానం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గద్దర్ (పద్మ విభూషణ్), చుక్కా రామయ్య (పద్మ భూషణ్), అందెశ్రీ (పద్మ భూషణ్), గోరటి వెంకన్న (పద్మ శ్రీ), జయధీర్ తిరుమలరావు (పద్మ శ్రీ) వంటి ప్రముఖుల పేర్లను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడం 4 కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించ డమేనని పేర్కొన్నారు.
మంత్రులు, అధికారులతో జరిగిన సమావేశంలో ఈ అంశంపై సీఎం చర్చించారు. తెలంగాణకు పద్మ పురస్కారాల్లో జరిగిన అన్యాయంపై ప్రధాని మోదీకి లేఖ రాయాలనే యోచనలో సీఎం రేవంత్ ఉన్నట్టు సమాచారం. తెలంగాణ సమాజానికి వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్నను గుర్తించకపోవడం రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవానికి భంగం కలిగించడమేనని రేవంత్ పేర్కొన్నారు. 139 మందికి పురస్కారాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కనీసం 5 పురస్కారాలు ప్రకటించకపోవడం అన్యాయమని అన్నారు.