- ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంలో పద్మారావుగౌడ్ గెలుపు ఖాయమైందని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ టికెట్ కన్ఫం అయిన నేపథ్యంలో ఆదివారం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, కాలేరు వెంకటేశ్ లు పద్మారావుగౌడ్ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పద్మారావు గౌడ్ ప్రజల మనిషని, సికింద్రాబాద్ ఎంపీగా ఆయన గెలుపు ఖాయమైందన్నారు.
ఇక్కడి నుంచి కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నియోజకవర్గ ప్రజలను ఏనాడు పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న దానం నాగేందర్ గురించి మాట్లాడాలంటే సిగ్గుచేటుగా ఉందన్నారు. ప్రణాళిక బద్ధంగా ప్రచారం చేపట్టి పద్మారావు గౌడ్ను గెలిపిస్తామన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు రామేశ్వర్ గౌడ్, కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, రాసురి సునీత రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు పద్మారావుగౌడ్ను సన్మానించారు.