ప్రతిపక్ష నాయకులు దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని.. రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని అన్నారు. కార్ణాటకలో ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ నాయకులు.. తెలంగాణకు వచ్చి ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ కు అధికారమే కావాలి తప్ప.. ప్రజల బాగోలు పట్టించుకోదని విమర్శించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం(నవంబర్ 4) సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ మండి డివిజన్ లోని పలు బస్తీలు, కాలనీలలో పద్మారావు గౌడ్ ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు.. సికింద్రాబాద్ లో అభివృద్ధి జరగలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
75 కోట్ల రూపాయలతో తుకారాం గేటు ఆర్ యుబి నిర్మించామని, పేద ప్రజల దీర్ఘ కాలిక సమస్యలను పరిష్కరించామని ఆయన తెలిపారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. అభివృద్ధి మంత్రంగా నడుస్తున్న తెలంగాణ సర్కారు ముందు ప్రతిపక్షాలు కుప్పి గంతులు వేస్తే.. ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. చేసిన అభివృద్ధి సంక్షేమ పనులే తనను గెలిపిస్తాయని ఆయన అన్నారు. నియోజకవర్గంలో మరింత అభివృద్ధి జరగాలంటే.. కారు గుర్తుకే ఓటు వేసి తనను గెలిపించాలని పద్మారావు ఓటర్లను అభ్యర్థించారు.