సూపర్‌‌‌‌–4కు పాకిస్తాన్.. యూఏఈపై గెలిచి ముందుకు.. ఆటకు ముందు హైడ్రామా..

సూపర్‌‌‌‌–4కు పాకిస్తాన్.. యూఏఈపై గెలిచి ముందుకు.. ఆటకు ముందు హైడ్రామా..
  • రిఫరీ పైక్రాఫ్ట్‌‌తో సారీ చెప్పించుకొని మ్యాచ్‌‌ ఆడిన పాక్‌‌

దుబాయ్‌‌:  ఆసియా కప్‌‌లో మరో హైడ్రామా నడిచింది. ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఆండ్రీ పైక్రాఫ్ట్‌‌ను తొలగించకుంటే టోర్నీ నుంచి తప్పుకుంటామని హెచ్చరించిన పాకిస్తాన్ బుధవారం (సెప్టెంబర్ 17) నాటకీయ పరిణామాల మధ్య గంట ఆలస్యంగా మొదలైన గ్రూప్‌‌–ఎ చివరి లీగ్‌‌ మ్యాచ్‌‌లో యూఏఈపై 41 రన్స్ తేడాతో  గెలిచి సూపర్‌‌‌‌–4 రౌండ్‌‌కు క్వాలిఫై అయింది. 

ఆదివారం మరోసారి ఇండియాను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. యూఏఈతో పోరుకు కూడా పైక్రాఫ్ట్ రిఫరీగా ఉండటంతో నిర్ణీత టైమ్‌‌కు పాక్‌‌ ప్లేయర్లు  గ్రౌండ్‌‌కు రాకుండా హోటల్లోనే ఉండిపోయారు. అయితే, పైక్రాఫ్ట్‌‌ను తప్పించాలన్న పాక్  డిమాండ్‌‌ను ఐసీసీ పట్టించుకోలేదు. దాంతో పాక్ టోర్నీ నుంచి తప్పుకుందన్న వార్తలు వచ్చాయి. 

 చివరకు పైక్రాఫ్ట్ పాక్​ కెప్టెన్, మేనేజర్‌‌తో సమావేశమై  ఇండియాతో మ్యాచ్‌‌లో జరిగిన మిస్‌‌ కమ్యూనికేషన్‌‌కు క్షమాపణ చెప్పాడు. దాంతో మ్యాచ్ ఆడిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 146/9 స్కోరు చేసింది. ఫఖర్ జమాన్ (50) ఫిఫ్టీ కొట్టగా.. చివర్లో షాహీన్ షా ఆఫ్రిది (29 నాటౌట్‌‌) మరోసారి మెరుపులు మెరిపించాడు. 

యూఏఈ పేసర్ జునైద్‌‌ సిద్దిఖీ (4/18), స్పిన్నర్ సిమ్రన్ జీత్ సింగ్ (3/26) సత్తా చాటారు.  అనంతరం ఛేజింగ్‌‌లో యూఏఈ ఓ దశలో 85/3తో  పాక్‌‌కు షాకిచ్చేలా కనిపించినా.. చివరకు 17.4 ఓవర్లలో 105 రన్స్‌‌కు  ఆలౌటైంది. రాహుల్ చోప్రా (35), ధ్రువ్ పరాస్కార్‌‌‌‌ (20) పోరాడినా ఓటమి తప్పలేదు. పాక్ బౌలర్లలో షాహీన్‌‌, అబ్రార్‌‌‌‌, రవూఫ్‌‌ చెరో రెండు  వికెట్లు పడగొట్టారు.