దళితుడిని పెళ్లి చేసుకుందని తల్లిదండ్రులే చంపేశారు

దళితుడిని పెళ్లి చేసుకుందని తల్లిదండ్రులే చంపేశారు

చిత్తూరు, వెలుగు: దళితుడిని ప్రేమ వివాహం చేసుకుందని తల్లిదండ్రులే కన్న కూతుర్ని కడతేర్చిన దారుణమైన ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. పెళ్లయిన రెండురోజుల్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యువతి చందన కేసు పరువు హత్యగా తేలింది. చందనను తల్లిదండ్రులే హత్య చేశారని ఆమె భర్త, దళితసంఘాల నాయకులు  ఆందోళన చేశారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అనుమానితులను విచారించగా అసలు విషయం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు శాంతిపురం మండలం రెడ్లపల్లికి చెందిన మైనర్ బాలిక చందన తల్లిదండ్రులకు తెలియకుండా దళితుడిని పెళ్లి చేసుకుంది.

తమ మాట విననందుకు తల్లి అమరావతి, తండ్రి వెంకటేశు పెళ్లయిన రెండోరోజే కూతురు చందనను గొంతు నులిమి చంపేశారు. సూసైడ్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. రాత్రికి రాత్రే శవాన్ని ఊరి బయటకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టారు. అక్కడ ఆనవాళ్లు లేకుండా చేయాలని బూడిదను సంచుల్లో మూటగట్టారు. కర్నాటక రాష్ట్రంలోని క్యాసంబల్ల వద్ద ఒక చెరువులో ఆ బూడిదను పడేశారు. అక్కడి గ్రామస్థులు వారిని అడ్డుకోవడంతో ఈ దారుణం బయటపడింది. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు చెప్పారు.