
సభ సజావుగా సాగేందుకు సహకరించండి: స్పీకర్ బిర్లా
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియతో రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జులై 18 నుంచి ఆగష్టు 12 వరకు ఈ సెషన్ సాగనుంది. మొత్తం 26 రోజుల వ్యవధిలో దాదాపు 18 రోజులు ఉభయ సభలు భేటీ కానున్నాయి. దాదాపు 24 కీలక బిల్లులను కేంద్రం సభల ముందుకు తీసుకురానుంది. లోక్ సభలో పెండింగ్లో ఉన్న ఇండియన్ అంటార్కిటిక్ బిల్లు–2022, ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్(సవరణ) బిల్లు 2019, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అండ్ దేర్ డెలివరీ సిస్టం సవరణ బిల్లు 2022 లోక్ సభలో పాసై రాజ్య సభ ముందుకు రానున్నాయి. కొత్తగా సెంట్రల్ యూనివర్సిటీల సవరణ బిల్లు–2022, ది ఫ్యామిలీ కోర్ట్స్(సవరణ) బిల్లు–2022 తోపాటు కొన్ని కీలక బిల్లులను కేంద్రం సభలలో ప్రవేశపెట్టనుంది. కాగా మహారాష్ట్ర, గోవాల్లో ఎమ్మెల్యేల ఫిరాయింపు, ద్రవ్యోల్బణం, అగ్నిపథ్, ఇంధన ధరల పెంపు, నిత్యవసర ధరలు, ఇతర అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు విపక్షాలు వ్యూహాలకు పదును
పెడుతున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రతి వ్యూహాలను సిద్ధం చేసుకుంది.
సహకరించండి.. బిర్లా
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని అన్ని పార్టీల సభ్యులను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కోరారు. పార్లమెంట్ హాల్లో శనివారం ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. జీరో అవర్లో అంశాలను లేవనెత్తేందుకు నోటీసు సమర్పణ సమయంలో మార్పు చేసినట్లు వెల్లడించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై చర్చించాలని నేతల్ని కోరారు. ఈ భేటీలో పార్టీల ఫ్లోర్ లీడర్లు పాల్గొన్నారు. టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్తో భేటీ కారణంగా ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావు పాల్గొనలేదు. కాగా ఆదివారం రాజ్య సభ చైర్మన్ వెంకయ్య నాయుడు రాజ్య సభ ఫ్లోర్ లీడర్లతో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనున్నారు.