కవిత అరెస్టుపై సుప్రీంకు!..లాయర్లతో కేటీఆర్, హరీశ్ చర్చలు

కవిత అరెస్టుపై సుప్రీంకు!..లాయర్లతో కేటీఆర్, హరీశ్ చర్చలు
  • ఈడీ ఆఫీసులో కవితతో భేటీ.. తొలిరోజు ఈడీ విచారణపై ఆరా 
  • ఇయ్యాల విచారణకు రావాలని విజయ్ నాయర్, అరుణ్ పిళ్లైకి ఈడీ ఆదేశం!  

న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నారు. కవిత ఈడీ కస్టడీ నేపథ్యంలో కేటీఆర్, హరీశ్ రావు ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. ఆమెకు లీగల్ గా అందించాల్సిన సహాయంపై న్యాయ నిపుణులతో చర్చించారు. కవిత కేసును వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ విక్రమ్ చౌదరిని కలిశారు. కాసేపు చర్చల అనంతరం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ముకుల్ రోహత్గీలు కూడా వర్చువల్ గా ఈ మీటింగ్ కు హాజరైనట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. 

దాదాపు అరగంట పాటు సాగిన ఈ భేటీలో న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చించినట్టు సమాచారం. కవిత అరెస్టును సవాల్ చేస్తూ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అదే విధంగా ఇప్పటికే కవిత వేసిన పిటిషన్ పై మంగళవారం సుప్రీంలో కొనసాగించాల్సిన వాదనలపైనా చర్చించినట్టు సమాచారం. 

కవితతో సమావేశం.. 

ఈడీ కస్టడీలో ఉన్న కవితను ఆమె భర్త అనిల్, కేటీఆర్, హరీశ్ రావు, లాయర్ మోహిత్ రావు కలిశారు. ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కుటుంబసభ్యులను కలిసేందుకు కవితకు కోర్టు అనుమతిచ్చింది. దీంతో ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముందే ఢిల్లీలోని ఈడీ హెడ్ ఆఫీస్ కు అనిల్, కేటీఆర్, హరీశ్ రావు చేరుకున్నారు.

ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా వచ్చారు. లాయర్ మోహిత్ రావు కోర్టు ఆర్డర్స్ ను ఈడీ సిబ్బందికి చూపించి లోపలికి వెళ్లేందుకు పర్మిషన్ తీసుకోగా.. ఆయనతో పాటు అనిల్, కేటీఆర్, హరీశ్ రావు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. మిగతా వాళ్లకు ఈడీ ఆఫీస్ మెయిన్ గేట్ వరకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. కాగా, తొలిరోజు పర్మిషన్ ప్రొసీజర్ కారణంగా కవితను కుటుంబసభ్యులు కలవడం కాస్తా ఆలస్యమైంది.

దీంతో టైమ్ ప్రకారం 6 నుంచి 7 గంటల వరకు అనుమతి ఉండగా, అధికారులు అదనంగా మరికొంత సమయం ఇచ్చినట్టు ఈడీ వర్గాలు ద్వారా తెలిసింది. 7:33 గంటలకు మీటింగ్ రూమ్ నుంచి కేటీఆర్, హరీశ్ రావు బయటకు రాగా.. భర్త అనిల్ కాసేపు కవితతో ఒంటరిగా మాట్లాడినట్టు సమాచారం. దాదాపు 15 నిమిషాల తర్వాత అనిల్, అడ్వకేట్ మోహిత్ బయటకురాగా.. అందరూ కలిసి ఈడీ ఆఫీసు నుంచి వెళ్లిపోయారు. మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. 

కవిత భావోద్వేగం.. 

కుటుంబసభ్యులను చూడగానే కవిత భావోద్వేగానికి గురైనట్టు తెలిసింది. ఈ సందర్భంగా కేటీఆర్, హరీశ్ ఆమెకు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చినట్టు సమాచారం. తొలుత కుటుంబసభ్యులను ప్రత్యేక రూమ్​లో ఉంచిన అధికారులు.. కవితను అక్కడికి తీసుకొచ్చారు. అనంతరం 40 నిమిషాల పాటు భేటీ జరిగింది. ఈ సందర్భంగా తొలిరోజు ఈడీ విచారణ జరిపిన తీరు, ఏమేం ప్రశ్నలు అడిగారు? తదితర వివరాలను కవితను అడిగి తెలుసుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కాగా, కవితతో భేటీ అనంతరం న్యాయ నిపుణులతో అనిల్, కేటీఆర్, హరీశ్ రావు మరోసారి చర్చలు జరిపారు. ఈ భేటీ అర్ధరాత్రి వరకు సాగింది.  

సింపుల్ గా తొలిరోజు విచారణ.. 

కవిత కస్టడీలో భాగంగా తొలిరోజు ఈడీ విచారణ సింపుల్ గానే ముగిసినట్టు తెలిసింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని నిబంధనలు ఉండగా.. ఆ మేరకు ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియ మీనా, ఆఫీసర్ తుమ్మోజీ వరలక్ష్మీ సమక్షంలో విచారించినట్టు సమాచారం. ఈ సందర్భంగా మీ ఫోన్లు ఎందుకు ఫార్మాట్ చేశారు? ఇండో స్పిరిట్స్ లో మీకు 33 శాతం వాటా ఉందా? ఈ స్కామ్ లో మీ పాత్ర ఏమిటి? హోటల్ మీటింగ్స్ లో ఎందుకు పాల్గొన్నారు? అని కవితను ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది.

ఈ కేసులో మాజీ ఆడిటర్ బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి, శ్రీనివాస్ తదితరులు ఇచ్చిన వాంగ్మూలాలపై ఆమె స్టేట్ మెంట్ ను రికార్డు చేసినట్టు సమాచారం. కాగా, ఆదివారం సెలవుదినం కావడంతో ఈడీ అధికారులు కవితను విచారించలేదని చర్చ జరిగింది. అయితే ఇలాంటి మినహాయింపులేం లేవని ఈడీ వర్గాలు తెలిపాయి. అప్రూవర్లుగా మారిన శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ్, దినేశ్ అరోరా, నిందితుడు సమీర్ మహేంద్రు వాంగ్మూలాలపై కూడా కవితను ఆరా తీయనున్నట్టు వెల్లడించాయి.

సౌత్ గ్రూప్ లో కవిత తరఫున కీలకంగా వ్యవహరించిన బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, శ్రీనివాస్, గోపీ కుమారన్ తదితరులతో కలిపి ఆమెను విచారించే ఆస్కారం ఉందని పేర్కొన్నాయి. ఆప్ మాజీ కమ్యూనికేషన్ ఇన్ చార్జ్ విజయ్ నాయర్, అరుణ్ పిళ్లైని ఈడీ అధికారులు సోమవారం విచారణకు పిలిచినట్లు తెలిసింది.