సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు స్టేషన్ పరిధిలోని పలు ఏటీఎమ్ లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పోలీసులు. గ్యాస్ కట్టర్ల సహాయంతో ఏటీఎమ్ మిషన్లను ధ్వంసం చేసి దొంగతనాలకు పాల్పడుతున్న వారిని శనివారం మీడియా ముందు ప్రవేశ పెట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. కరోన సమయంలో ఏటీఎమ్ లు టార్గెట్ గా చేసుకొని ఇద్దరు వ్యక్తులు అమీన్ పూర్, పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని 6 ఏటీఎమ్లలో దొంగతనాలకు యత్నించారు. రామచంద్రపురం కి చెందిన అబ్దుల్ ఖలీల్ తో పాటు ఎరుకల మహేష్ అనే ఇద్దరు యువకులు గ్యాస్ కట్టర్ ల సహాయంతో చోరీలకు యత్నం చేశారు. డబ్బు లభించకపోవడంతో శుక్రవారం రాత్రి పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రుద్రారం గ్రామంలోని మరో ఏటీఎమ్ లో చోరీకి ప్రయత్నించారు. అదే సమయంలో పోలీసులు నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి ఒక ద్విచక్ర వాహనాన్ని, గ్యాస్ సిలిండర్లు, కట్టర్ తో పాటు పనిముట్లను స్వాధీన పరుచుకొని రిమాండ్ కి తరలించారు.
