ఆల్ట్న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబేర్ మరో కేసులో బెయిల్ లభించింది. ఒక వర్గం మనోభావాలు దెబ్బతీసేలా ట్వీట్ చేశాడన్న కేసులో ఢిల్లీ పటియాల హౌస్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 50వేల పూచికత్తుతో పాటు దేశం విడిచి వెళ్లకూడదని కోర్టు ఆదేశించింది. అయితే ఉత్తరప్రదేశ్ లో నమోదైన మరో రెండు కేసుల్లో బెయిల్ లభించకపోవడంతో జుబేర్ జైల్లోనే ఉండనున్నారు.
కాగా తనపై ఉత్తరప్రదేశ్ పోలీసులు నమోదు చేసిన ఆరు కేసులను కొట్టివేయాలంటూ మహ్మద్ జుబేర్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. యూపీలోని ముజఫర్నగర్, ఘజియాబాద్, సీతాపూర్, లఖింపూర్, హత్రాస్లలో జుబేర్పై ఆరు ఎఫ్ఐఆర్లు జుబేర్ పై నమోదయ్యాయి. తనపై పెండింగ్లో ఉన్న కేసులను విచారించేందుకు యూపీ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయడాన్ని కూడా సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు.
ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రీత్ ఇందర్ సింగ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. 2018లో మనోభావాలు దెబ్బతీసేలా సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారంటూ ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదుపై జూన్ 27వ తేదీన ఢిల్లీ పోలీసులు జుబేర్ను అరెస్ట్ చేశారు. మనోభావాలను దెబ్బతీశారంటూ సీతాపూర్లో నమోదైన కేసులో ఆయన మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు గతంలో పొడిగించింది. తాజాగా మరో కేసులో బెయిల్ లభించగా..ఇంకో రెండు కేసుల్లో ఎలాంటి ఊరట కల్పించకపోవడంతో జుబేర్ ప్రస్తుతం జైలులోనే ఉన్నాడు.