నన్ను ఓడించడానికి ఓటుకు లక్ష - పవన్ కళ్యాణ్

నన్ను ఓడించడానికి ఓటుకు లక్ష - పవన్ కళ్యాణ్

2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ రెట్టింపయింది. ముఖ్యంగా ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష నేతలు విమర్శల డోస్ పెంచటంతో రాష్ట్రంలో యుద్దవాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పిఠాపురం నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడి నుండి పోటీ చేస్తానని ప్రకటించటమే ఇందుకు కారణం.

ఇటీవల పిఠాపురంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం కాబోయే ఎమ్మెల్యే తానేనని, వంగా గీత ప్రజారాజ్యంతోనే రాజకీయాల్లోకి వచ్చారని, భవిషత్తులో ఆమె జనసేనలో చేరితే బాగుంటుందని పిలుపునిచ్చారు. వైసీపీ నేతల దగ్గర చాలా డాబులున్నాయని, తనను ఓడించటానికి కోట్లు కోట్లు ఖర్చు పెడతారని, ఓటుకు లక్ష రూపాయలైనా ఇస్తారని అన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి. పవన్ వ్యాఖ్యలు ఓటర్లను అవమానించే విధంగా ఉన్నాయని వైసీపీ శ్రేణులు కామెంట్ చేస్తున్నారు.