పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ రూపొందించిన చిత్రం ‘ఉస్తాద్ భగత్సింగ్’. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. మార్చి 19న సినిమా విడుదల కానుంది. ఆదివారం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘భారతీయ చిత్ర పరిశ్రమ బాగుండాలని కోరుకునే వాడ్ని నేను. ప్రతి సినిమా విజయం సాధించాలనే అందరం పనిచేస్తాం. కానీ కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించవు. నేను దర్శకుడ్ని పూర్తిగా నమ్ముతాను.
కథ మారిన తర్వాత నలభై రోజుల్లోనే ఈ సినిమా పూర్తి చేశాం. రోజుకు నాలుగైదు గంటలు మాత్రమే నేను పనిచేశా. సరిగ్గా ప్లాన్ చేస్తే నేను మరిన్ని సినిమాలు చేయొచ్చనే భరోసా ఇచ్చింది ఈ చిత్రం. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు. బెస్ట్ ఎఫెర్ట్స్ పెట్టిన ఈ చిత్రం ‘గబ్బర్ సింగ్’ అంతటి విజయం సాధిస్తుందని నమ్ముతున్నా’ అని అన్నారు. దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ ‘నేను కథ మార్చడమే వలనే ఈ సినిమా డీలే అయ్యింది. అయినా సపోర్ట్ చేసిన నిర్మాతలకు థ్యాంక్స్. కథ మార్చిన తర్వాత చాలా వేగంగా పూర్తి చేశాం.
ఉగాది పండుగకు పవన్ కళ్యాణ్ గారి మూవీతో స్టార్ట్ చేయడం ఆనందంగా ఉంది. ఇది ఉస్తాద్ ఉగాదిగా నిలుస్తుంది’ అని చెప్పాడు. పవన్ సర్ నుంచి ఎంతో నేర్చుకున్నా అని శ్రీలీల చెప్పింది. కెరీర్ ప్రారంభం నుంచి పవన్ కళ్యాణ్ గారితో నటించాలనే కోరిక ఈ చిత్రంతో నెరవేరిందని రాశీ ఖన్నా చెప్పింది. ‘పవన్ కళ్యాణ్ గారితో మూవీ నిర్మించాలనే కోరిక ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో నెరవేరడం చాలా ఆనందంగా ఉంది.
ఈ సినిమా కోసం ఆయన చేసిన సపోర్ట్ మర్చిపోలేం. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్కు ఉన్న వెలితి ఈ చిత్రంతో తీరింది. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా మూవీ ఉంటుంది’ అని నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ అన్నారు. కార్యక్రమానికి హాజరైన దర్శకుడు బుచ్చిబాబు సానా. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. నటులు పార్థిబన్, సత్యం రాజేష్, కమల్ కామరాజ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, లిరిసిస్టులు కాసర్ల శ్యామ్, భాస్కరభట్ల సహా టీమ్ అంతా పాల్గొన్నారు.
