న్యూఢిల్లీ, వెలుగు: గతంలో సమైక్యత వాదినంటూ, తెలంగాణ వారి దిష్టి తగిలిందన్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, ఇప్పుడేమో తెలంగాణ అమరవీరులకు నివాళులర్పిస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని సీపీఐ నేషనల్ సెక్రటరీ రామకృష్ణ అన్నారు. స్థిరత్వం లేని వ్యాఖ్యలతో పవన్ కల్యాణ్ మనస్తత్వం సాగుతోందనటానికి ఇవే నిదర్శనాలన్నారు.
ఢిల్లీ పర్యటనలో తెలంగాణ, ఏపీకి సంబంధించి పవన్ చేసిన వ్యాఖ్యలకు మంగళవారం ఆయన కౌంటర్ ఇచ్చారు. ‘‘కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏపీ, తెలంగాణకు అన్యాయం చేసింది. కాబట్టే సీపీఐగా మేం కచ్చితంగా కేంద్రాన్ని నిలదీస్తాం. పవన్ కల్యాణ్ లాగా పూటకో మాట మాట్లాడడం కమ్యూనిస్టులకు చేతకాదు’’ అని అన్నారు. పవన్ తాను చేసే పనులను ఇతరులపై రుద్దాలనే మనస్తత్వాన్ని ఇకనైనా మానుకోవాలని రామకృష్ణ హితవు పలికారు.
