పేటీఎం సంస్థపై రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న సంచలన నిర్ణయం దేశీయ ఫిన్టెక్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ను రద్దు చేస్తూ ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పేటీఎం యూపీఐ అండ్ బిజినెస్ యూజర్లతో పాటుగా ఇన్వెస్టర్లలో గందరగోళం నెలకొంది. తమ యూపీఐ సేవలు పనిచేయవనే అనుమానంలో సామాన్యులు.. బిజినెస్ పేమెంట్స్ ఎలారా బాబు అంటూ వ్యాపారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అందరి అనుమానాలను నివృత్తి చేసేందుకు పేటీఎం సంస్థ కీలక వివరణ ఇచ్చింది.
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949లోని సెక్షన్ 22(4) ప్రకారం ఏప్రిల్ 24, 2026 నుంచి అమలులోకి వచ్చేలా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ను ఆర్బీఐ రద్దు చేసింది. బ్యాంక్ వ్యవహారాలు డిపాజిటర్ల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని, పబ్లిక్ ఇంట్రెస్ట్కు వ్యతిరేకంగా యాజమాన్య తీరు ఉందని ఆర్బీఐ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో బ్యాంక్ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసి, దానిని మూసివేసేందుకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు రిజర్వు బ్యాంక్ స్పష్టం చేసింది.
యూజర్లపై ప్రభావం ఉంటుందా?
పేటీఎం యాప్ వాడుతున్న కోట్లాది మంది వినియోగదారులకు కంపెనీ పెద్ద ఊరటనిచ్చింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది సపరేటుగా నిర్వహించబడుతున్న ఒక ప్రత్యేక సంస్థ అని.. దానితో తమ కోర్ బిజినెస్కు సంబంధం లేదని పేటీఎం తెలియజేసింది. అందువల్ల Paytm UPI, QR కోడ్, సౌండ్బాక్స్, కార్డ్ మెషీన్లు ఎప్పటిలాగే అంతరాయాలు లేకుండా పనిచేస్తాయని వెల్లడించింది. అలాగే పేటీఎం మనీ ద్వారా చేసే పెట్టుబడులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని తెలియజేసింది. యూజర్లు ఆందోళన చెందకుండా తమ యూపీఐ సేవలను యథావిధిగా కొనసాగించవచ్చని కంపెనీ భరోసా ఇచ్చింది.
పేమెంట్స్ బ్యాంక్ లో తమకు ఎటువంటి డైరెక్ట్ మేనేజ్మెంట్ బాధ్యతలు కూడా లేవని పేటీఎం స్పష్టం చేసింది. 2024 మార్చి నాటికే ఆ బ్యాంక్లో ఉన్న పెట్టుబడులను కంపెనీ లెక్కల నుంచి తొలగించినందున, ప్రస్తుత లైసెన్స్ రద్దు వల్ల పేటీఎంపై అదనపు ఆర్థిక భారం పడదని వెల్లడించింది. ఇది కేవలం ఒక ప్రత్యేక సంస్థకు సంబంధించిన విషయమని, దీనిని పేటీఎం పేరెంట్ కంపెనీకి ఆపాదించవద్దని కోరింది.
సోమవారం స్టాక్ మార్కెట్ రియాక్షన్ ఎలా ఉండొచ్చు?
శుక్రవారం పేటీఎం షేర్లు ఒక్కోటి రూ.1147 రేటు వద్ద ముగిశాయి. లైసెన్స్ రద్దు వార్త శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత వచ్చినందున.. సోమవారం ఉదయం స్టాక్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే ఇప్పటికే ఈ అంశంపై మార్కెట్లో అవగాహన ఉండటం, పేటీఎం తన యూపీఐ సేవలకు వచ్చిన నష్టం లేదని క్లారిటీ ఇవ్వడం కొంత సానుకూలతను కలిగించవచ్చు. సో బ్యాంక్ లైసెన్స్ రద్దు అయినా.. పేటీఎం యాప్ సేవలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయని స్పష్టమవుతోంది.

