
- ఇక రాజకీయ ముఖచిత్రంలో బీఆర్ఎస్ ఉండదు
- బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాన్ని కవిత బయటకు తీశారు
- ఆమె వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సమర్థించిండు
- రాజాసింగ్ ప్రశ్నలకు కిషన్రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలి
- -బండి సంజయ్ యువ మోర్చా లీడర్లా మాట్లాడుతున్నరని ఫైర్
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: కవిత ఇష్యూ అనేది కేసీఆర్ఫ్యామిలీ పంచాయితీ అని పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ అన్నారు. ఇంటి ఆస్తుల పంపకాల్లో వచ్చిన తేడాలతోనే వారు రోడ్డునపడ్డారని చెప్పారు. ఇక రాజకీయ ముఖచిత్రంలో బీఆర్ఎస్ ఉండదని అన్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్ అండ్ కాలేజీలో 3 రోజులుగా కొనసాగుతున్న తెలంగాణ ఆదివాసీ కాంగ్రెస్ బునియాడి కార్యకర్తల సమ్మేళనం శనివారం ముగిసింది.
ముగింపు కార్యక్రమంతోపాటు మీడియాతోనూ మహేశ్కుమార్గౌడ్ మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాన్ని కవిత బయటకు తీశారని చెప్పారు. కవిత వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్సమర్థించారని అన్నారు. దీనిపై అటు బీఆర్ఎస్ నాయకులు, ఇటు కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ కేంద్రమంత్రిగా ఉండి.. ఇంకా యువ మోర్చా నాయకుడిలా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు.
పదేండ్లలో బీఆర్ఎస్ పార్టీ అడ్డంగా దోచుకున్నదని, పదేండ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దీన్ని ఆపలేకపోయిందని మండిపడ్డారు. బీఆర్ఎస్దోపిడీపై బీజేపీ సర్కారు చర్యలు తీసుకోలేదని, తాము అధికారంలోకి వచ్చాక ఆ పనిచేస్తున్నామని తెలిపారు. మరో 15 రోజుల్లోపు కాళేశ్వరం కమిషన్ రిపోర్టు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్లోపాయికారి ఒప్పందంలో ఉండి ప్రజాధనాన్ని దోచుకున్నాయని ఆరోపించారు. బీజేపీ కి తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మద్దతు ఇవ్వబోరని అన్నారు.
గిరిజన సంక్షేమాన్ని పట్టించుకున్నది కాంగ్రెస్సే
ఇందిరమ్మ హయాం నుంచి ప్రస్తుత కాంగ్రెస్ పాలన వరకు గిరిజన సంక్షేమం పట్ల తమ నిబద్ధత ఎన్నటికీ తగ్గలేదని మహేశ్గౌడ్ అన్నారు. గిరిజన సమాజాలను సాధికారపరిచేందుకు ఇందిరాగాంధీ భూ సీలింగ్ చట్టాన్ని ప్రవేశపెట్టారని, దీనిని తర్వాత పీవీ. నరసింహారావు పూర్తిగా అమలు చేశారని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు నిరంతరం గిరిజన ఉద్ధరణ, అభివృద్ధికి అనుకూలంగా చట్టాలను సవరించాయన్నారు. పదేండ్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజన సమస్యలను పట్టించుకోలేదని, పోడు భూముల కోసం పోరాడుతున్న వారిపై తప్పుడు కేసులు నమోదు చేసిందని మండిపడ్డారు.
ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద అర్హత ఉన్న భూములను కూడా పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ పాలనలో ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద 2.30 లక్షల గిరిజన రైతులకు 6.69 లక్షల ఎకరాల భూమి హక్కులు మంజూరు చేశామని తెలిపారు. గిరిజన జీవితాలను మార్చేందుకు ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని తీసుకొచ్చామని చెప్పారు. కాంగ్రెస్ మాత్రమే జల్, జంగల్, జమీన్ అనే నినాదానికి కట్టుబడి ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 90 కి పైగా సీట్లతో స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందనీ దీమా వ్యక్తం చేశారు.
గులాంగిరి చేసేటోళ్లు కాంగ్రెస్ కార్యకర్తలు కారు : మీనాక్షి నటరాజన్
గులాంగిరి చేసేవాళ్లు కాంగ్రెస్ కార్యకర్తలు కారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. కుమ్రం భీం, బిర్సాముండా, అంబేద్కర్స్ఫూర్తితో ఆదివాసీ లీడర్లు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
పదేండ్లలో ఆత్మగౌరవం లేదు: భట్టి
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నిధులు రాలేదని, ఆదివాసీలకు ఆత్మగౌరవం కల్పించలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సబ్ ప్లాన్ నిధులను కూడా మళ్లించిన ఘనత బీఆర్ఎస్ దేనని విమర్శించారు. ప్రజా ప్రభుత్వంలో సబ్ ప్లాన్ కింద గిరిజనులకు రూ. 17,169 కోట్లను బడ్జెట్లో కేటాయించామని చెప్పారు. గతంలో ఖర్చు చేయని రూ. 1,296 కోట్ల నిధులను క్యారీ ఫార్వర్డ్ చేశామన్నారు. ధరణి పేరుతో అసైన్డ్ భూములను గత బీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకుంటే.. భూ భారతి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం భూ హక్కులు కల్పిస్తున్నదని చెప్పారు.
గిరిజనులకు అండగా ఉంటాం: మంత్రి పొంగులేటి
ఆదివాసీ గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. జై బాపు, జై భీం, జై సంవిధాన్ పేర దేశ వ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రోగ్రాంకు ముందు స్పోర్ట్స్ స్కూల్ ఆవరణలో మీనాక్షి నటరాజన్తోపాటు ఎంపీలు, మంత్రి, ఎమ్మెల్యేలు మొక్కలు నాటారు. ఈ ప్రోగ్రాంలో మహబూబాబాద్, ఖమ్మం ఎంపీలు పోరిక బలరాం నాయక్, రామసహాయం రఘురామిరెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావ్, పాయం వెంకటేశ్వర్లు, రాందాస్ నాయక్, మట్టా రాగమయి, జారే ఆదినారాయణ, తదితరులు మాట్లాడారు.