- రాజ్యాంగ వ్యవస్థలను, ప్రజాస్వామ్యాన్ని మోదీ గుప్పిట్లో పెట్టుకున్నాడు
- పవన్ను ముందుపెట్టి బీజేపీ రాజకీయం చేస్తున్నదని మండిపాటు
- బీజేపీ సీటు చోరీకి వ్యతిరేకంగా గాంధీభవన్లో సత్యాగ్రహ దీక్షకు ముఖ్య అతిథిగా హాజరు
హైదరాబాద్, వెలుగు: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా తిరస్కరించిందని పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ మండిపడ్డారు. అదే జార్ఖండ్లో అంబానీ సన్నిహితుడు పరిమళ నత్వానీ నామినేషన్ విషయంలో సరైన పత్రాలు సమర్పించకున్నా.. ఆయనకు మరోసారి అవకాశం ఇచ్చారని అన్నారు.
నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం.. మీనాక్షి నటరాజన్ విషయంలో ఒకతీరు, నత్వానీ విషయంలో ఇంకో తీరుగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యవస్థలను, ప్రజాస్వామ్యాన్ని మోదీ తన గుప్పిట్లో పెట్టుకున్నాడని ఆరోపించారు. శనివారం గాంధీ భవన్లో రాజీవ్ పంచాయతీరాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో సేవ్ డెమోక్రసీ పేరుతో ఒకరోజు సత్యాగ్రహ దీక్ష సాగింది. దీనికి పీసీసీ చీఫ్ ముఖ్య అతిథిగా హాజరై.. పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘తెలంగాణలో మీనాక్షి నటరాజన్పై కేసు లేదు. ఎఫ్ఐఆర్ లేదు. ఆర్వో ఏ రకంగా ఆమె నామినేషన్ను తిరస్కరిస్తారు.
ప్రజాస్వామ్యంలో అలాంటి తప్పు చేసిన ఆర్వోను ఉరితీసినా తప్పులేదు” అని అన్నారు. మీనాక్షి నటరాజన్ నిజాయతీపరురాలని, పార్లమెంట్లో ఆమె కొట్లాడుతారనే మోదీ అడ్డుకున్నారని పేర్కొన్నారు. అయినా ఆమె ఆత్మస్థైర్యాన్ని ఏమాత్రం దెబ్బతీయలేరని, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో కేంద్రపై పోరాడుతారని చెప్పారు. మీనాక్షికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాడుతామని స్పష్టం చేశారు. మోదీకి కనువిప్పు కావాలనే ఈ సత్యాగ్రహ దీక్ష చేస్తున్నట్టు చెప్పారు.
రాష్ట్రంలో పాగా వేయాలని కుట్ర
తెలంగాణలో పవన్ కల్యాణ్ను ముందుపెట్టి బీజేపీ రాజకీయం చేస్తున్నదని మహేశ్ కుమార్గౌడ్ మండిపడ్డారు. పవన్ కల్యాణ్ను అడ్డంపెట్టుకొని రాష్ట్రంలో పాగావేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని, అయినా తెలంగాణలో ఆ పార్టీకి స్థానం లేదన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచేది కాంగ్రెస్సేనని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ గాడ్సే జపం చేస్తుందని, దేశంలో గాడ్సే రాజ్యాన్ని స్థాపించే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలను మోదీ చీల్చి చెండాడుతున్నాడని అన్నారు.‘సర్’ పేరుతో లౌకికవాదుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతున్నదని, ఈ విషయంలో పార్టీ కేడర్ అప్రమత్తంగా ఉండాలని కోరారు.
అర్హులకు సంబంధించిన ఒక్క ఓటు కూడా తొలగించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ దీక్షలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, రాజీవ్ పంచాయతీరాజ్ సంఘటన్ జాతీయ చైర్మన్ సునీల్ పన్వర్, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్తోపాటు పలువురు డీసీసీ అధ్యక్షులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.
