సీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు పని విభజన

సీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు పని విభజన
  • రాష్ట్రంలోని 17 లోక్​సభ నియోజకవర్గాలకు ఇన్​చార్జీలుగా నియామకం
  • ఒక్కో లోక్​సభ నియోజకవర్గానికి ఒక ఉపాధ్యక్షుడు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు

హైదరాబాద్, వెలుగు: పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్  కుమార్  గౌడ్  పని విభజన చేశారు. రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో ఉపాధ్యక్షుడిని, ముగ్గురు ప్రధాన కార్యదర్శులను ఇన్ చార్జీలుగా నియమించారు. ఆదివారం హైదరాబాద్  లో పీసీసీ చీఫ్  మహేశ్  కుమార్  గౌడ్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం 17 మంది రాష్ట్ర ఉపాధ్యక్షులు, 51 మంది ప్రధాన కార్యదర్శులకు ఈ బాధ్యతలు అప్పగించారు. తమకు అప్పగించిన నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కోసం వీరు బూత్ స్థాయిలో పర్యవేక్షణ చేయనున్నారు. 

ఉపాధ్యక్షుల వివరాలు ఇలా ఉన్నాయి..

ఆదిలాబాద్ కు రఘువీర్ రెడ్డి (ఎంపీ), పెద్దపల్లికి గాలి అనిల్ కుమార్, కరీంనగర్ కు నాయిని రాజేందర్ రెడ్డి (ఎమ్మెల్యే), నిజమాబాద్ కు బల్మూరి వెంకట్ (ఎమ్మెల్సీ), జహీరాబాద్ కు బండి రమేశ్, మెదక్ కు నవాబ్  ముజాహిద్దిన్  ఆలం ఖాన్, మల్కాజ్ గిరికి బస్వరాజు సారయ్య (ఎమ్మెల్సీ), సికింద్రాబాద్ కు ఝాన్సీరెడ్డి, హైదరాబాద్ కు సంగమేశ్వర్, చేవెళ్లకు బొంతు రామ్మోహన్, నాగర్ కర్నూల్ కు కొండేటి మల్లయ్య, నల్గొండకు నమిండ్ల శ్రీనివాస్, భువనగిరికి  కోటంరెడ్డి వినయ్ రెడ్డి, వరంగల్ కు సత్యనారాయణ, మహబూబాబాద్ కు పొట్ల నాగేశ్వర్ రావు, ఖమ్మంకు శ్రవణ్ కుమార్ రెడ్డి, మహబూబ్ నగర్ కు వేణు గౌడ్ ను ఇన్ చార్జులుగా నియమించారు. వీరికి తోడు ఒక్కో నియోజకవర్గానికి మరో ముగ్గురు ప్రధాన కార్యదర్శులు ఇన్ చార్జీలుగా ఉంటారు. వీరే కాకుండా మరో 9 మంది ఉపాధ్యక్షులకు, మరో 9 మంది ప్రధాన కార్యదర్శులకు పీసీసీ ఆర్గనైజేషన్ లో ఇన్ చార్జీలుగా బాధ్యతలు అప్పగించారు.