
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాలల ఫీజు పెంపు ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ (పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. అనిల్ డిమాండ్ చేశారు. ఫీజుల పెంపుపై తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ అథారిటీ (టీఏఎఫ్ఆర్సీ) కమిటీ చేసిన ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని కోరారు.
శుక్రవారం హైదరాబాద్లోని తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయం ముందు పీడీఎస్యూ నేతలు ధర్నా నిర్వహించారు. ఫీజుల పెంపు ప్రతిపాదనను తీవ్రంగా నిరసించారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ నేతలు మాట్లాడుతూ..ఇంజినీరింగ్ విద్యార్థులపై ఫీజుల భారం మోపడం అన్యాయమన్నారు. ప్రవేశాల సమయంలో కాలేజీ యాజమాన్యాలు అధిక మొత్తంలో డొనేషన్లు వసూలు చేస్తున్నాయన్నారు.
ఇంజినీరింగ్ విద్య సామాన్య విద్యార్థులకు అందుబాటులో ఉండాలని.. కానీ, ఫీజు పెంపు, డొనేషన్ల వసూళ్లు విద్యార్థుల భవిష్యత్తుపై ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తున్నాయని వాపోయారు. ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు డొనేషన్ల పేరుతో విద్యార్థులను దోపిడీ చేస్తున్నాయన్నారు. ఈ అనవసర ఆర్థిక భారాన్ని తొలగించాలని చేశారు. ప్రభుత్వం ఫీజుల పెంపు ప్రతిపాదనను రద్దు చేయకపోతే నిరసనలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
విద్యార్థుల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని, ప్రభుత్వం తమ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ధర్నాలో పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాకేశ్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు కర్క గణేశ్, వెంకటేశ్, నాయకులు నాగరాజు, అంగిడి కుమార్, అశూర్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.