
హసన్పర్తి, వెలుగు: మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ ను ఆపివేయాలని, కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించాలని కోరుతూ శుక్రవారం కాకతీయ యూనివర్సిటీలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రౌండ్ టేబుల్ సమావేశాన్ని కాకతీయ యూనివర్సిటీ పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో పోలీసులు, ప్రజా సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమావేశం నిర్వహించకుండా పోలీసులు రూమ్స్కు తాళం వేసి బయటకు పంపించారు. దీనిని నిరసిస్తూ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ఆఫీస్ నుంచి ఫస్ట్ గేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రొఫెసర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని, వరంగల్లో నిర్వహించ తలపెట్టిన సమావేశాన్ని ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ విధానాలు అమలు చేస్తోందని విమర్శించారు.
మోదీ ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాణి, జయంత్, టీపీఎఫ్ రాష్ట్ర నాయకులు బి రమాదేవి, పీడీఎస్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి నాగరాజు, న్యూడెమోక్రసీ గ్రేటర్ వరంగల్ కమిటీ కార్యదర్శి రాచర్ల బాలరాజు పాల్గొన్నారు.