- గ్రామసభలో తీర్మానించిన పాలకవర్గం, గ్రామస్తులు
మునిపల్లి, వెలుగు: మండలంలోని పెద్దలోడి(లోనికలాన్)లో కొత్త పంచాయతీ పాలకవర్గం బుధవారం సర్పంచ్ హన్మంత్ రాజు అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో మద్యపానాన్ని నిషేధిస్తూ తీర్మానం చేశారు. 18 ఏళ్ల లోపు వారికి సిగరెట్లు అమ్మవద్దని తీర్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజు మాట్లాడుతూ గ్రామంలో బెల్ట్షాపులతో యువత చెడిపోతున్నారని, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు మద్యపానం నిషేధిస్తున్నట్లు తెలిపారు.
ఎవరైనా గ్రామంలో మద్యం అమ్మితే పోలీసులకు సమాచారం అందించి జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ మద్యపాన నిషేదానికి సహకరించాలని కోరారు. ఉప సర్పంచ్ మన్నె ప్రేమ్నంద్, పంచాయతీ కార్యదర్శి యాదగిరి, వార్డు సభ్యులు పట్లోళ్ల జయమ్మ, మన్సాన్పల్లి జనార్ధన్, భారతమ్మ, సూర్ణు మౌనిక సుధాకర్, మన్నె వినోద్ రావు, మహిళా సంఘం అధ్యక్షురాలు వడ్డే శాంతమ్మ, సూర్ణు కేజీవమ్మ, ఆశా వర్కర్లు సావిత్రి, రోషమ్మ, అంగన్వాడీ టీచర్ మంజుల పాల్గొన్నారు.
