- కరీంనగర్లో ముగిసిన మ్యాచ్లు
గోదావరిఖని/తిమ్మాపూర్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ అంతర్ జిల్లాల సెకండ్ ఫేజ్ క్రికెట్ టోర్నీ పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. రామగుండం ఎన్టీపీసీలోని మహాత్మాగాంధీ స్టేడియంలో రెండు రోజుల పాటు జరగనున్న పోటీలను ఎన్టీపీసీ తెలంగాణ, రామగుండం ప్లాంట్ల హెడ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సమంత, ఐఎన్టీయూసీ నేషనల్ సీనియర్ సెక్రెటరీ బాబర్ సలీం పాషా ప్రారంభించారు.
ఉదయం నల్గొండ, ఆదిలాబాద్ జట్ల మధ్య పోటీ జరగగా, ముందుగా బ్యాటింగ్ చేసిన నల్గొండ జట్టు 19.2 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ఆదిలాబాద్ 20 ఓవర్లు ఆడి 9 వికెట్లు కోల్పోయి 126 పరుగులు మాత్రమే చేసింది. ఆదిలాబాద్పై నల్గొండ జట్టు 15 రన్స్ తేడాతో గెలిచింది. 16 రన్స్ చేసి, 2 వికెట్లు తీసిన శివుడుకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
మధ్యాహ్నం ఖమ్మం, కరీంనగర్ జట్ల మధ్య పోటీ జరగగా, ముందుగా బ్యాటింగ్ చేసిన ఖమ్మం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన కరీంనగర్ జట్టు 10.5 ఓవర్లలో 68 పరుగులకు ఆలౌట్ అయింది. ఖమ్మం బౌలర్ షేక్ అజర్ 2.5 ఓవర్లు వేసి 13 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయగా, అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ముగిసిన పోటీలు..
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్లోని వెలిచాల జగపతిరావు మెమోరియల్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న క్రికెట్ పోటీలు ఆదివారం ముగిసాయి. ఉదయం నిజామాబాద్,- రంగారెడ్డి జట్ల మధ్య మ్యాచ్ జరగగా, ముందుగా బ్యాటింగ్ చేసిన నిజామాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులు చేసింది. విక్రమ్ జాదవ్ 62 బంతుల్లో 84 పరుగులు చేయగా, రిత్విక్ రాజ్ 41 బంతుల్లో 54 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు అందించారు.
రంగారెడ్డి బౌలర్లలో ఈశ్వర్ 4 ఓవర్లు వేసి 33పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. రంగారెడ్డి జట్టు 20 ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే చేసింది. విక్రమ్ నాయక్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. మధ్యాహ్నం హైదరాబాద్, మెదక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 13.4 ఓవర్లలో 68 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది. అనంతరం మెదక్ 2 వికెట్లు కోల్పోయి 6.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.
మెదక్ బౌలర్ వరుణ్ తేజ్ 3.4 ఓవర్లు వేసి 13 పరుగులిచ్చి 5 వికెట్లు తీయగా, మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ దక్కింది. కేడీసీఏ అధ్యక్షుడు వి ఆగంరావు, కార్యదర్శి మురళీధర్ రావు, ఉపాధ్యక్షుడు మహేందర్ గౌడ్, మనోహర్ రావు, ట్రెజరర్ బండి శ్రవణ్ కుమార్, కార్యవర్గసభ్యులు హరికృష్ణ గౌడ్, సాగర్ రావు, అజిత్ మ్యాచ్ను పర్యవేక్షించారు.
గ్రామీణ యువతలో ప్రతిభను వెలికితీసేందుకే..
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మంత్రి వివేక్ వెంకటస్వామి ‘కాకా’ మెమోరియల్ క్రికెట్ టీ20 టోర్నమెంట్కు శ్రీకారం చుట్టారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. రామగుండంలో జరిగిన పోటీలకు ఎంపీ హాజరై మాట్లాడారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల యువ క్రీడాకారులకు సమాన అవకాశాలు కల్పించడమే ఈ లీగ్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఇటువంటి టోర్నమెంట్లు క్రీడలపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదిగేందుకు వేదికగా నిలుస్తాయని చెప్పారు. ఐపీఎల్ మ్యాచ్లకు తీసిపోకుండా క్రీడాకారులు తమ ప్రతిభను చాటుతున్నారని అభినందించారు. నల్గొండ టీమ్లో ప్రతిభ చూపిన శివుడుకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఎంపీ వంశీకృష్ణ అందజేశారు.
