ఉత్తమ పర్యాటక గ్రామాలుగా.. పెంబర్తి, చంద్లాపూర్

ఉత్తమ పర్యాటక గ్రామాలుగా.. పెంబర్తి, చంద్లాపూర్
  • ఉత్తమ పర్యాటక గ్రామాలుగా.. పెంబర్తి, చంద్లాపూర్
  • ఈ నెల 27న ఢిల్లీలో అవార్డుల ప్రదానం
  • హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు : జనగామ జిల్లాలోని పెంబర్తి, సిద్దిపేట జిల్లాలోని చంద్లాపూర్ 2023 ఏడాదికి గాను ఉత్తమ పర్యాటక గ్రామాలుగా నిలిచాయి. ఇప్పటికే తెలంగాణ కళలకు, సాంస్కృతిక, పర్యాటక కేంద్రాలకు అంతర్జాతీయ గుర్తింపు రావడంలో చొరవ తీసుకుంటున్న కేంద్రం... తాజాగా ఈ రెండు గ్రామాలను ఉత్తమ పర్యాటక గ్రామాలుగా ఎంపిక చేసింది. ఈ మేరకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటనలో విడుదల చేసింది. ఈ నెల 27న ఇంటర్నేషనల్ టూరిజం డే సందర్భంగా ఢిల్లీలో జరిగే ప్రోగ్రామ్​లో ఈ అవార్డులను అందజేయనున్నట్లు వెల్లడించింది.

హస్తకళలతో ఆకర్షిస్తున్న పెంబర్తి

కాకతీయుల కాలం నుంచి హస్తకళలకు పెంబర్తి ప్రసిద్ధి చెందింది. ఇత్తడి, కంచు లోహాలతో తయారు చేసే కళాకృతులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. అమెరికా, జర్మనీ, బెల్జియం, జపాన్ తదితర దేశాలు వీటిని దిగుమతి చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రతిబింబించే కళాకృతులు, దేవతల విగ్రహాలు, కళా ఖండాలు, గృహ అలంకరణ వస్తువులెన్నో ఇక్కడి కళాకారుల చేతివృత్తుల నైపుణ్యానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయి. అలాగే, ప్రతి ఏటా దాదాపు 25 వేల మంది టూరిస్ట్ లు ఈ గ్రామాన్ని సందర్శిస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే, తెలంగాణకే సొంతమైన ఈ సంస్కృతి, కార్మికుల కృషితో జరుగుతున్న వ్యాపారాన్ని దృష్టిలో ఉంచుకుని.. పెంబర్తిని కేంద్ర ప్రభుత్వం ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసింది. అలాగే, పెంబర్తి ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ గుర్తింపు విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం చొరవతీసుకుంది. 

చంద్లాపూర్  గొల్లభామ’ చీరలు

రంగనాయక స్వామి దేవాలయం, గ్రామీణ పర్యాటకానికి చంద్లాపూర్ ప్రసిద్ధి. ఇక్కడి గొల్లభామల చీరలకు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ఈ ప్రాంతాన్ని ఉత్తమ పర్యాటక గ్రామంగా కేంద్రం గుర్తించింది. తెలంగాణ నుంచి పెంబర్తి, చంద్లాపూర్ లు ఉత్తమ పర్యాటక గ్రామాలుగా ఎంపికవడం పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతంలోని కళాకృతులకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు, గౌరవాన్ని కల్పిస్తున్నదన్నారు. అంతర్జాతీయ వేదికలతో పాటు, ఇటీవల దేశం గర్వించేలా నిర్వహించిన జీ–-20 సదస్సులోనూ భూదాన్ పోచంపల్లి ఇక్కత్ చీరలను, నేతన్నలు నేసిన కండువాలను వివిధ దేశాల అధినేతలకు, విదేశీ ప్రముఖులకు అందజేసినట్లు గుర్తు చేశారు. అలాగే, 2021లో భూదాన్ పోచంపల్లి గ్రామానికి డబ్ల్యూఎన్ డబ్ల్యూటీఓ ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తింపు కల్పించే విషయంలో కేంద్రం ప్రత్యేక చొరవతీసుకుందని గుర్తు చేశారు.