- వీణవంక మండలం శ్రీరాములపల్లిలో ఈటల జమున ఇంటింటి ప్రచారం
కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను లక్ష మెజారిటీతో గెలిపిస్తామని భరోసా ఇస్తున్నారని ఆయన సతీమణి ఈటల జమున వెల్లడించారు. వీణవంక మండలం శ్రీరాములపల్లి గ్రామంలో ఈటల జమున గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈటల రాజేందర్ కు అన్యాయం చేశారని బాధపడుతున్నారని.. ఈటల రాజేందర్ కి తాము అండగా ఉంటామని అందరూ తమకు మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. మీరు అస్సలు తిరగనవసరం లేదు.. లక్ష మెజారిటీతో గెలిపిస్తమని అంటున్నారని ఆమె పేర్కొన్నారు.
ఈటల మాకు సేవ చేశారు.. మేం ఆయనకు అండగా ఉంటామంటున్నారు
ఇప్పటివరకు ఈటల రాజేందర్ మాకు సేవ చేశారు.. ఈ సారి మేము ఆయనకు అండగా ఉంటామని ప్రజలు అంటున్నారని ఆమె తెలిపారు. పెద్దలు, పిల్లలు యువకులు అందరూ అండగా ఉంటామని చెబుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. శ్రీరాముల పేటలో ఒక్కరు కూడా ఇంట్లో ఉండకుండా బయటికి వచ్చి తమకు మద్దతు తెలపడం సంతోషంగా ఉందన్నారు. ఈసారి కేసీఆర్ కి బుద్ది చెప్పడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.