- ఆ రాష్ట్రం ఈ స్థితిలో ఉండడానికి అక్కడి ప్రభుత్వాలే కారణమని వ్యాఖ్య
- మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలతో సీఎం భేటీ
హైదరాబాద్, వెలుగు: ఒకప్పుడు మహారాష్ట్ర నుంచి తాను నేర్చుకున్నానని, ఇప్పుడు తానే మహారాష్ట్రకు నేర్పిస్తున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. మహారాష్ట్ర ఈ పరిస్థితుల్లో ఉండడానికి అక్కడి ప్రభుత్వాల బాధ్యతారాహిత్యమే కారణమన్నారు. మహారాష్ట్రకు చెందిన బీఆర్ఎస్ నేతలతో సోమవారం తెలంగాణ భవన్లో జరిగిన భేటీలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో పార్టీ నిర్మాణం, బలోపేతంపై ఈ సమావేశంలో చర్చించారు. కేసీఆర్ మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రజలను తెలంగాణ ప్రగతి మోడల్ అమితంగా ఆకట్టుకుంటోందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడ కనిపించినట్టుగా, ఇప్పుడు మహారాష్ట్ర లో ప్రజా స్పందన కనిపిస్తోందన్నారు.
మహారాష్ట్రలో బీఆర్ఎస్ గాలి వీస్తోందన్నారు. ఈనెల 5 నుంచి జూన్ 5 వరకూ పార్టీ విస్తరణ కార్యక్రమం చేపట్టాలని, ప్రతి గ్రామంలోనూ 9 కమిటీలు వేయాలని సూచించారు. నాగ్ పూర్, ఔరంగాబాద్, పూణే, ముంబైలో బీఆర్ఎస్ ఆఫీసులను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. మహారాష్ట్రంలో ఏ పార్టీతోనూ బీఆర్ఎస్కు పొత్తు ఉండదని కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో 20 శాతం ఉన్న దళితులను, సమాజంలో 50 శాతం ఉన్న స్త్రీలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయనంత వరకు ఈ దేశం ముందుకు సాగదని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఇప్పటి దాకా ఏ ప్రధానీ చేయని అప్పులను ప్రధాని మోడీ చేశారని ఆయన విమర్శించారు.