సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ ప్రగతిభవన్ వద్ద ఓ వ్యక్తి పెట్రోల్ బాటిల్ తో హల్ చల్ చేశాడు. ఒంటి మీద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోబోయాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతనిని కాపాడారు. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి మలక్ పేట్ కు చెందిన మహ్మద్ నజరుద్దీన్ గా గుర్తించారు. లాక్ డౌన్ కారణంగా తన చెప్పుల షాప్ మూత పడడటంతో జీవనోపాథి కోల్పోయానని, అందుకే ఆత్మహత్య యత్నం చేశానని తెలిపాడు.
రెండు నెలలుగా వ్యాపారం ఆగిపోయిందని, దాంతో ఆదాయం లేక కుటుంబాన్ని సాకలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు నజిరుద్దీన్. రెండు నెలలుగా పని లేకపోవడంతో తన కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందని, ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆత్మహత్యా యత్నం చేశానని చెప్పాడు. ప్రభుత్వం తన లాంటి చిరు వ్యాపారులకు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. అతన్ని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకొని వివరాలు సేకరిస్తున్నారు.