పద్మారావునగర్, వెలుగు: కరోనా సోకిందనే అనుమానంతో గాంధీ హాస్పిటల్కు వెళ్లి మిస్సయిన ఓ వ్యక్తి.. 20 రోజుల తర్వాత అదే హాస్పిటల్ మార్చురీలో డెడ్బాడీగా దొరకడం కలకలం రేపుతోంది. అసలు తను ఎలా చనిపోయాడు, గాంధీ హాస్పిటల్ మార్చురీలో ఎలా చేర్చారు, ఫ్యామిలీకి సమాచారం ఎందుకు ఇవ్వలేకపోయారు, ఏం జరిగిందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తన సోదరుడు గాంధీ హాస్పిటల్కు వెళ్లి మిస్సయ్యాడంటూ ముఖేష్సింగ్ పోలీసులకు కంప్లైంట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
కరోనా లక్షణాలున్నాయని తీసుకెళ్లి..
హైదరాబాద్లోని ధూల్పేటకు చెందిన నరేందర్సింగ్ (35) అనారోగ్యంతో గత నెల 30న కింగ్కోఠి హాస్పిటల్కు వెళ్లాడు. డాక్టర్లు నరేందర్కు కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించి గాంధీ హాస్పిటల్కు పంపించారు. ఆ రోజున, మరుసటి రోజున నరేందర్సింగ్ తన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడాడు. తర్వాతి నుంచి అతని ఫోన్ స్విచాఫ్ వచ్చింది. దీంతో నరేందర్ సోదరుడు ముఖేశ్సింగ్ మంగళ్హాట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఎటూ తేలకపోయే సరికి ముఖేశ్సింగ్ మూడు రోజుల కింద సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశాడు. తన సోదరుడు గాంధీకి వెళ్లి మిస్సయ్యాడంటూ వివరాలు చెప్పాడు. ఆచూకీ చెప్పకపోతే హైకోర్టుకు వెళ్తానన్నాడు. అయితే మంగళ్ హాట్ పోలీసులు శనివారం గాంధీ హాస్పిటల్కు వచ్చి మార్చురీలను పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తిగా జనరల్ మార్చురీలో ఉంచిన నరేందర్సింగ్ డెడ్బాడీని గుర్తించి, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. నరేందర్ చనిపోయాడని తెలియడంతో కుటుంబ సభ్యులు ఆవేదనకు లోనయ్యారు. గాంధీ డాక్టర్లు, స్టాఫ్ నిర్లక్ష్యంతోనే నరేందర్ చనిపోయాడని.. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్చేశారు.
మృతి వెనుక సందేహాలెన్నో?
నరేందర్ కరోనా పేషెంటా, కాదా.. గాంధీ జనరల్ మార్చురీలోకి ఆ డెడ్బాడీ ఎలా వచ్చింది, గుర్తుతెలియని వ్యక్తిగా ఎలా నిర్ధారించా్చారనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా గుర్తు తెలియని శవాలను ఉస్మానియా హాస్పిటల్కు తరలిస్తారు. అలాకాకుండా గాంధీకి ఎలా తరలించారనేది తేలాల్సి ఉంది. ఇటీవల గాంధీలో కరోనా పేషెంట్ల డెడ్బాడీలు తారుమారవడం వివాదంగా మారింది. ఇప్పుడు కరోనా లక్షణాలతో మిస్సయిన వ్యక్తి బాడీ జనరల్ మార్చురీలో కనిపించడం కలకలం రేపుతోంది.
హాస్పిటల్ స్టాఫ్ నిర్లక్ష్యమేం లేదు
‘నరేందర్సింగ్ కరోనా పేషెంట్ కాదు. అతను గత నెల 30న ఒకసారి ఔట్పేషెంట్ వార్డుకు వచ్చి వెళ్లినట్టు రికార్డులో ఉంది. అతడి వివరాలు కరోనా వార్డులో లేవు. ఈ డెత్కు సంబంధించి మెడికో లీగల్ కేసుగా వివరాలు నమోదు చేశాం. పోలీసులే గుర్తు తెలియని బాడీగా మార్చురీలో చేర్చారు. ఇందులో గాంధీ హాస్పిటల్ స్టాఫ్ నిర్లక్ష్యమేమీ లేదు. – ఎం.రాజారావు, గాంధీ సూపరింటెండెంట్