ఉప్పల్,వెలుగు: ట్యాంకర్ల నుంచి పెట్రోల్ఎత్తుకెళ్తున్న దొంగలను మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఓటీ పోలీసులు తెలిపిన ప్రకారం.. చర్లపల్లి పెట్రోలియం సంస్థల నుంచి పెట్రోల్, డీజిల్, విమానాల్లో వాడే ఇంధనాన్ని ట్యాంకర్ల ద్వారా వివిధ ప్రాంతాలకు తరలిస్తుంటారు. సోమవారం బీపీసీఎల్ చర్లపల్లిలో పెట్రోల్ ట్యాంకర్(టీఎస్08యూజీ-2502) విమాన ఇంధనాన్ని లోడ్ చేసుకొని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు వెళ్తుంది.
మార్గమధ్యలో మల్లాపూర్ గోకుల్ నగర్ లో ట్యాంకర్ను ఆపి దయానంద్ అనే వ్యక్తి ట్యాంకర్నుంచి పెట్రోల్ తీస్తుండగా సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దయానంద్తో పాటు ట్యాంకర్ డ్రైవర్ శ్రీనివాస్ను అదుపులోకి తీసుకుని నాచారం పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేశారు. దయానంద్ పైన గతంలో కూడా నాచారం పోలీస్ స్టేషన్ లో కేసులు ఉన్నాయి.