- కొత్త టాబ్లెట్ను తయారు చేసిన అమెరికా కంపెనీ
- వైరస్ సోకకుండా.. సోకినంక చికిత్సకూ ఉపయోగం
న్యూయార్క్: కరోనా ట్రీట్మెంట్కు త్వరలో టాబ్లెట్ను అందుబాటులోకి తీసుకొస్తామని అమెరికా కంపెనీ ఫైజర్ ప్రకటించింది. తయారీ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని, దాని పనితీరుపై ప్రయోగాలు జరుగుతున్నాయని చెప్పింది. ఇప్పటికే జరిపిన పరీక్షల్లో టాబ్లెట్ వాడకం సేఫ్ అని తేలిందన్నారు. దీంతో కరోనా బారిన పడకుండా ఈ యాంటీ వైరల్ డ్రగ్ రక్షణ కల్పిస్తుందా లేదా తెలుసుకోడానికి 2,660 మందిపై ప్రయోగం చేస్తున్నట్లు తెలిపింది. హెచ్ఐవీ ట్రీట్మెంట్లో ఉపయోగించే యాంటీవైరల్ డ్రగ్ రిటోనావిర్తో కలిపి ఈ టాబ్లెట్ను టెస్ట్ చేస్తున్నట్లు పేర్కొంది.
వ్యాక్సిన్లు వచ్చినయ్.. మందులకే కొరత
కరోనా బారిన పడకుండా అడ్డుకోవడానికి పలు వ్యాక్సిన్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వైరస్ బారినపడినోళ్లకు ట్రీట్మెంట్ ఇచ్చేందుకే సరైన మందులు లేవు. ఇప్పుడు ఇస్తున్న మందులు రోగి శరీరంలోని ఇమ్యూనిటీని, వ్యాధిపై పోరాడే శక్తిని పెంచేవే తప్ప నేరుగా వైరస్ను టార్గెట్ చేసే మందులు చాలా తక్కువని ఫైజర్ ప్రతినిధులు చెప్పారు. వాటి ఖరీదు కూడా చాలా ఎక్కువని, ప్రొడక్షన్ తక్కువగా ఉండడం వల్ల మార్కెట్లో వాటికి కొరత ఉందని వివరించారు. పైగా వాటిని ఆస్పత్రులలో మాత్రమే ఉపయోగించాలి తప్ప సాధారణ మాత్రల్లా వాడలేమని పేర్కొన్నారు. ఈ క్రమంలో కరోనా ట్రీట్మెంట్లోని అవరోధాలను తప్పించి, ఆస్పత్రిలో చేరే పరిస్థితి రాకుండా చేయాలని ఓరల్ థెరపీ దిశగా ప్రయోగాలు చేశామన్నారు. ఫైజర్ టాబ్లెట్కరోనాను ఎర్లీ స్టేజ్లోనే అడ్డుకుంటుందని, బాధితుల నుంచి సోకకుండా చక్కగా ఆపుతుందని కంపెనీ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ మైకేల్ దోల్స్తెన్ వివరించారు.