ఫోన్ డేటాను కవిత డిలీట్ చేశారు : ఈడీ

ఫోన్ డేటాను కవిత డిలీట్ చేశారు  :  ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్ ఎవెన్యూ కోర్టు ఈడీ కస్టడీని మరో మూడు రోజులు పొడిగించింది. కవితకు గత వారం విధించిన 7 రోజుల కస్టడీ ముగియడంతో శనివారం ఆమెను ఈడీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టగా స్పెషల్ జడ్జి కావేరి బవేజా ఈ మేరకు కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెను ఈ నెల 26వ తేదీ ఉదయం11 గంటలలోపు తిరిగి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. 

విచారణ సందర్భంగా ఈడీ తరఫు అడ్వకేట్ జోహెబ్ హుస్సేన్ వాదిస్తూ.. కోర్టు ఆదేశాల మేరకు కవితకు రోజూ మెడికల్ టెస్టులు చేస్తున్నట్టు తెలిపారు. లిక్కర్ స్కాంలో రూ. 100 కోట్ల ముడుపుల చెల్లింపుల్లో కవిత కుట్రదారు అని చెప్పారు. కేసులో మరో నలుగురి వాంగ్మూలాలు తీసుకొని, కలిపి ప్రశ్నించినట్లు తెలిపారు. కవిత మొబైల్ ఫోన్ నుంచి సేకరించిన డేటాను విశ్లేషించి, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ తో కూడా సరిపోల్చినట్లు వివరించారు. 

మొబైల్ డేటా నుంచి కవిత కొంత సమాచారాన్ని డిలీట్ చేసినట్టు గుర్తించామన్నారు. కవిత తన మేనల్లుడి వ్యాపార వివరాలు అడిగితే, చెప్పలేదన్నారు. కవిత నివాసంలో సోదాల సందర్భంగా ఫోన్ సీజ్ చేశామని, ఆ వ్యక్తి (కవిత మేనల్లుడు) విచారణకు హాజరుకాలేదన్నారు. కోర్టులో వాదనలు జరుగుతున్న టైంలోనే హైదరాబాద్ లోని కవిత కుటుంబసభ్యుల నివాసంలో సోదాలు జరుగుతున్నాయని జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. 

కవిత మేనల్లుడి ద్వారా డబ్బు తరలించిన అంశంపై సమీర్ మహేంద్రుతో కలిపి విచారించేందుకు అప్లికేషన్ దాఖలు చేశామన్నారు. కేసులో మరింత సమాచారం రాబట్టాల్సి ఉన్నందున కవితను 5 రోజుల కస్టడీకి అప్పగించాలని కోరారు. అయితే, జడ్జి 3 రోజులు మాత్రమే కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.