
హనుమకొండ సిటీ, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధ్యులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక చైర్మన్, రిటైర్డ్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ డిమాండ్ చేశారు. హనుమకొండలోని తన నివాసంలో ఆదివారం నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గత పాలకులు ప్రజాస్వామ్యాన్ని కూలదోసి అనేక అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ప్రతిపక్షాలను బలహీనం చేసేందుకు ఫోన్లు ట్యాప్ చేశారన్నారు.
ఫోన్ ట్యాపింగ్ అక్రమాలతో ఎన్నికైన ప్రజాస్వామ్య ద్రోహులు తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ పై దర్యాప్తు జరుగుతోందని, దోషులను వదలకుండా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయనవెంట ఫోరం ఫర్ బెటర్ వరంగల్ అధ్యక్షుడు పుల్లూరు సుధాకర్, సామాజిక వేత్త బొమ్మినేని పాపిరెడ్డి, అడ్వకేట్ రాచకొండ ప్రవీణ్ తదితరులున్నారు.