మ‌రో వైసీపీ ఎంపీ తిరుగుబాటు.. రాజీనామా చేస్తానంటూ వార్నింగ్

మ‌రో వైసీపీ ఎంపీ తిరుగుబాటు.. రాజీనామా చేస్తానంటూ వార్నింగ్

వచ్చే ఎన్నికల్లో రామచంద్రపురం టికెట్‌పై వైసీపీ సీనియర్ నేత, ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు మళ్లీ టికెట్‌ ఇస్తే ఎంపీ పదవికి రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా పోటీచేస్తానని స్పష్టం చేశారు. వైసీపీ  ఆవిర్భావం నుంచి తాను జగన్‌తోనే ఉన్నానని చెప్పారు.  మంత్రి వేణు చెప్పు కింద బతికే వాళ్ళు నియోజకవర్గంలో ఎవరూ లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలు, క్యాడర్‌ దగ్గర చెల్లుబోయిన వేణు ఎన్ని రోజులు నటిస్తారని ప్రశ్నించారు.   

వేణు, తనని సమావేశపరుస్తానని సీఎం జగన్‌ చెప్పారని, అసలు  క్యారెక్టర్‌ లేని వ్యక్తితో తాను కూర్చోనని చెప్పేశానని పిల్లి సుభాష్‌ చంద్రబోస్ తెలిపారు. ఈ విషయంలో ఇబ్బంది పెట్టొద్దని జగన్‌కు చెప్పానని అన్నారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలోని వైసీపీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. మంత్రి వేణు, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌ వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పిల్లి సుభాష్‌ ఈ కామెంట్స్ చేశారు.