మరింత సులభంగా మ్యూచువల్‌ ఫండ్స్‌ రెగ్యులేషన్స్

మరింత సులభంగా మ్యూచువల్‌ ఫండ్స్‌ రెగ్యులేషన్స్
  • త్వరలో డ్రాఫ్ట్ రూల్స్‌‌‌‌ను ప్రకటించనున్న సెబీ

న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్‌‌‌‌లో ఇన్వెస్ట్ చేయడాన్ని సులభంగా మార్చేందుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చర్యలు తీసుకుంటోంది.  మ్యూచువల్ ఫండ్ రెగ్యులేషన్స్‌‌‌‌ను సమగ్రంగా సమీక్షిస్తోందని, ఇవి ఇన్వెస్టర్లపై ఎక్కువ ఫోకస్ పెట్టేలా,  ఇండస్ట్రీ -ఫ్రెండ్లీగా ఉంటాయని  ఒక సీనియర్ అధికారి శనివారం తెలిపారు. “మ్యూచువల్ ఫండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్‌‌‌‌వర్క్‌‌‌‌ను సమీక్షిస్తున్నాం.  ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంచడం లక్ష్యం” అని సెబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోజ్ కుమార్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) నిర్వహించిన 17వ మ్యూచువల్ ఫండ్ సమ్మిట్‌‌‌‌లో చెప్పారు. ప్రస్తుత రెగ్యులేషన్స్ చాలా క్లిష్టంగా ఉన్నాయని, ఇన్వెస్టర్ల అవసరాలు, ఇండస్ట్రీ ఇన్నోవేషన్స్‌‌‌‌కు అనుగుణంగా సులభతరం చేయడం అవసరమని అన్నారు. 

“ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. త్వరలో డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్‌‌‌‌ను ఫీడ్‌‌‌‌బ్యాక్, కన్సల్టేషన్ కోసం విడుదల చేస్తాం” అని కుమార్ వివరించారు.  కొత్త రూల్స్‌‌‌‌ను ఎప్పుడు అమల్లోకి తెస్తారో మాత్రం ప్రకటించలేదు.  ‘‘భారత సెక్యూరిటీస్ మార్కెట్‌‌‌‌ను బలపరిచేందుకు  సెబీ స్ట్రాటజిక్ రోడ్‌‌‌‌మ్యాప్‌‌‌‌ను రెడీ చేస్తోంది.  మ్యూచువల్ ఫండ్స్ అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనుంది.  ఫైనాన్షియల్ గ్రోత్, ఇన్వెస్టర్ ప్రొటెక్షన్లపై ఎక్కువ ఫోకస్ ఉంటుంది’’ అని కుమార్ తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్‌‌‌‌లో అడ్వైజరీ పనులను  రెగ్యులేట్ చేసే కన్సల్టేషన్ పేపర్ కూడా త్వరలో రానుంది. 

‘‘సెబీ ఆధ్వర్యంలో భారత్ మార్కెట్‌‌‌‌ రూపురేఖలు మారాయి. 1998లో ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ఎకోసిస్టమ్‌‌‌‌కు మారడం, ఆ తర్వాత 100శాతం డీమాట్‌‌‌‌ సాధించడం వంటివి గ్లోబల్‌‌‌‌గా భారత్ మాత్రమే చేసిన ఘనత. ఇప్పుడు మూడో ట్రాన్స్‌‌‌‌ఫర్మేషన్ మ్యూచువల్ ఫండ్ రివల్యూషన్ ద్వారా జరుగుతుంది” అని వివరించారు.  కాగా, భారత మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ సుమారు రూ. 72 లక్షల కోట్ల ఏయూఎం (అసెట్స్ అండర్ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌)ను నిర్వహిస్తోంది.  నెలవారీ సిప్‌‌‌‌ కంట్రిబ్యూషన్స్ రూ. 28 వేల కోట్లు దాటాయి. అయినప్పటికీ 140 కోట్ల జనాభాలో కేవలం 5 కోట్ల మంది ఇన్వెస్టర్లు మాత్రమే ఉన్నారు.