కెప్టెన్ శివ చౌహాన్‌ను ప్రశంసించిన ప్రధాని మోడీ

కెప్టెన్ శివ చౌహాన్‌ను ప్రశంసించిన ప్రధాని మోడీ

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సరిహద్దు రక్షణ స్థానం సియాచిన్‌లో మొట్టమొదటిసారిగా దళాధిపతిగా నియమితురాలైన మహిళా ఆఫీసర్ శివ చౌహాన్ ను ప్రధాని మోడీ ప్రశంసించారు. ఇది ప్రతీ భారతీయుడు గర్వించదగ్గ విషయమని, ఇది భారతదేశ నారీ శక్తి స్ఫూర్తిని వివరిస్తుందని ప్రధాని కొనియాడారు. కఠోరమైన శిక్షణ అనంతరం ప్రపంచంలోని ఎత్తైన యుద్ధభూమిపై మొదటి మహిళా అధికారిగా శివ చౌహానా నియమించబడ్డారు.

సైన్యంలోని ఫైర్ అండ్ ఫురీ కార్ప్స్ విభాగానికి చెందిన కెప్టెన్ శివ చౌహాన్ రక్షణ బాధ్యతలు చేపట్టారు. దీనికంటే ముందు కొన్ని నెలల పాటు సియాచిన్ బ్యాటిల్ స్కూల్లో ఆమె శిక్షణ పొందారు. ఇక్కడ అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో, అధిక మంచు, మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల నడుమ విధులు నిర్వహించడం అంత సులభం కాదు. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 15,632 అడుగుల ఎత్తులో ఉంటుంది. కఠోర శిక్షణ అనంతరం కుమార్ పోస్ట్ వద్ద శివ చౌహాన్ ను నియమించినట్టు ఇటీవలే ఫైర్ అండ్ ఫురీ కార్ప్స్ ట్విట్టర్ లో ప్రకటించింది.

రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కెప్టెన్ శివ చౌహాన్.. 11 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయారు. దీంతో ఆమె తల్లే కుటుంబ బాధ్యతలు చేపట్టి, శివను చదివించారు. భారత సాయుధ దళాల్లో చేరి దేశానికి సేవలు అందించాలన్న శివ అభిలాషతో ఆమె సైన్యంలో ప్రవేశం పొందారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీలో శిక్షణ పొందారు. అసాధారణ ప్రతిభా సామర్థ్యాలు ప్రదర్శించడంతో సియాచిన్ లో బ్యాటిల్ స్కూల్ శిక్షణకు ఎంపికయ్యారు. దీన్ని సైతం విజయవంతంగా పూర్తి చేసుకుని సియాచిన్ లోని ఓ పోస్ట్ వద్ద తాజాగా నియమితులయ్యారు.