
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జీవితం ఒక విజన్ తో కూడీ ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. చిన్న కార్యకర్త నుంచి ఉప రాష్ట్రపతి వరకు ఆయన జీవనం సాగిందన్నారు. 2024, జులై 1న వెంకయ్యనాయుడు పుట్టిన రోజు సందర్భంగా జూన్ 30వ తేదీ ఆదివారం హైదరాబాద్ గచ్చిబౌలిలో ఆయన జీవితానికి సంబంధించిన పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు జీవిత ప్రస్థానం, ప్రయాణం, జీవిత చరిత్ర మూడు పుస్తలను ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రధాని మోదీ ఆవిష్కరించారు.
అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ.. తన సహచరుడి పుట్టినరోజు సందర్భంగా పుస్తకాల ఆవిష్కరణ చేయడం సంతోషంగా ఉందన్నారు. వెంకయ్యనాయుడితో సుధీర్ఘ కాలం పాటు పని చేసే అవకాశం తనకు కలిగిందని చెప్పారు. గ్రామీణ ప్రాంతం నుంచి ఎంతో ఉన్నత స్థాయికి ఆయన చేరుకున్నారని కొనియాడారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పోరాడి.. ఆయన జైలు జీవితం గడిపారని తెలిపారు.
గ్రామాలు, రైతుల అభివృద్ధికి వెంకయ్యనాయుడు కట్టుబడి పనిచేశారని ప్రధాని అన్నారు. వెంకయ్యనాయుడు హయంలోనే స్మార్ట్ సిటీ, స్వచ్ఛ మిషన్ లాంటి ఎన్నో కార్యక్రమాలు వచ్చాయన్నారు. బీజేపీ, ఎన్డీఏ ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు వెంకయ్యనాయుడు ఎంతో కృషి చేశారని చెప్పారు. సింగిల్ లైన్ కౌంటర్ ఇవ్వడంలో వెంకయ్యనాయుడు దిట్ట అని ప్రధాని ప్రశంసించారు.