
ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్ లోని అందౌరా రైల్వే స్టేషన్ మధ్య నడిచే నాలుగో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్రారంభించనున్నారు. దీనిని ఉనా స్టేషన్ నుంచి ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రైలు ఢిల్లీ-హిమాచల్ ప్రదేశ్ మధ్య నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు ఉదయం 5.50 గంటలకు న్యూ ఢిల్లీ నుంచి బయలుదేరి... ఉదయం 11.05 గంటలకు అంబ్ అందౌరా స్టేషన్ కు చేరుకుంటుంది. మళ్లీ మధ్యాహ్నం అక్కడ నుంచి బయలుదేరి 6.25 గంటలకు న్యూ ఢిల్లీకి చేరుకోనుంది. బుధవారం మినహా వారానికి ఆరు రోజులు ఈ రైలు సేవలు అందుబాటులో ఉంటాయి. కాగా హిమాచల్ప్రదేశ్లలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి.
మరోవైపు చెన్నై-మైసూరు మధ్య ఐదవ వందే భారత్ రైలును ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు తెలిపారు. ప్రధాని మోడీ గత నెలలో మూడో వందే భారత్ రైలును ప్రారంభించారు. గాంధీ నగర్-ముంబై మార్గంలో ఈ రైలు నడుస్తోంది. అయితే ఇది ప్రమాదానికి గురికావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే దీనికి రిపేర్ చేసి ట్రాక్ మీదకు తీసుకొచ్చారు. మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ఢిల్లీ-వారణాసిల మధ్య ప్రారంభించారు. రెండో వందే భారత్ రైలును ఢిల్లీ- శ్రీ వైష్ణోదేవి మాతా, కట్రా మధ్య ప్రారంభించారు.