టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్, రష్మికల వివాహం గురువారం (ఫిబ్రవరి 26న) అత్యంత వైభవంగా జరగనుంది. రాజస్థాన్లోని చారిత్రాత్మక నగరం ఉదయపూర్లోని 'ది మెమెంటోస్ బై ఐటిసి హోటల్స్' వేదికగా వీరి పెళ్లి చాలా ప్రైవేట్గా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే, హల్దీ, మెహందీ సెలబ్రేషన్స్ షురూ అయ్యాయి.
ఈ సందర్భంలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ కాబోయే నూతన వధూవరులకు (విజయ్, రష్మికలకు) శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు పంపిన వివాహ ఆహ్వానానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందిస్తూ స్పెషల్ నోట్ ద్వారా విషెస్ అందించారు.
పీఎం మోడీ స్పెషల్ నోట్:
విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న కుటుంబాలకు పీఎం మోడీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ వివాహం వారి జీవితాల్లో “అందమైన కొత్త అధ్యాయం” ప్రారంభమవుతుందన్నారు. సప్తపది అనే పవిత్ర సంప్రదాయంలో భాగంగా ఏడడుగులు కలిసి వేస్తూ జీవితాంతం స్నేహితులు, భాగస్వాములుగా మారుతున్న ఈ క్షణం ఎంతో విశిష్టమని వెల్లడించారు.
సినిమాల్లో అనేక పాత్రలు పోషించిన విజయ్, రష్మికలు నిజ జీవితంలో ప్రేమ, అనురాగాలతో నిండిన కొత్త అధ్యాయాన్ని మరింత అందంగా నిర్మించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. పరస్పర గౌరవం, అవగాహనతో జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.
ఈ శుభసందర్భంగా వధూవరులకు, వారి కుటుంబ సభ్యులకు తన ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన నోట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
